గ్రేటర్​లో కొత్తగా 150 బస్​షెల్టర్లు

గ్రేటర్​లో కొత్తగా 150 బస్​షెల్టర్లు
  •     బల్దియాకు ఆర్టీసీ ప్రతిపాదనలు  
  •     కొత్త రూట్లలో స్టాపులున్న చోట ఏర్పాటుకు రిక్వెస్ట్​
  •     ఎండాకాలం వస్తుండడంతో ఏర్పాట్లు
  •     ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా 1,250 బస్​షెల్టర్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్​పరిధిలో 150 కొత్త బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలంటూ గ్రేటర్​ఆర్టీసీ అధికారులు జీహెచ్ఎంసీకి ప్రతిపాదనలు పంపారు. సిటీలో బస్​షెల్టర్ల నిర్మాణ బాధ్యతలను జీహెచ్ఎంసీనే చూసుకుంటోంది. మహానగరంలో ఆర్టీసీ 2,800 బస్సులు నడుపుతుండగా, వీటిలో రోజుకు దాదాపు రెండున్నర లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరి కోసం ఆయా రూట్లలో ప్రస్తుతం 1,250 బస్​షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి.

 అయితే, బస్సులు ఆగే చాలా ప్రదేశాల్లో షెల్టర్లు లేవు. బస్సుల కోసం గంటల తరబడి నిలబడే వేచి చూడాల్సి వస్తోంది.  స్టాప్​లేకపోవడంతో డ్రైవర్లు కూడా ఒకరోజు ముందు, మరో రోజు వెనక ఆపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సులు రాగానే ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో కొత్త బస్​షెల్టర్లు కట్టాలంటూ ఆర్టీసీ.. బల్దియాకు ప్రపోజల్స్​పంపింది. 

కొత్త రూట్లు పెరగడంతో.. 

కొత్త రూట్లలో తిరుగుతున్న బస్సులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో బస్​షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎల్బీనగర్, దిల్​సుఖ్​నగర్​కారిడార్, సుచిత్ర నుంచి మేడ్చల్​కారిడార్, లింగంపల్లి, పటాన్​చెరు కారిడార్​లో రోడ్ల వెడల్పు పనుల కారణంగా చాలా చోట్ల షెల్టర్లను తొలగించారు. 

ఇక లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, ఉప్పల్, హబ్సిగూడ, జేబీఎస్, అల్వాల్, బొల్లారం తదితర ముఖ్యమైన ప్రాంతాల్లోనూ బస్​షెల్టర్లు లేవు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో కొత్త బస్​షెల్టర్ల కోసం ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏప్రిల్​నాటికి వీటిని పూర్తిచేయాలని కోరుతున్నారు.

జేబీఎస్​ నుంచి ఎయిర్​పోర్టుకు ఆరు కొత్త పుష్పక్​ బస్సులు 

శంషాబాద్​ఎయిర్​పోర్టుకు కనెక్టివిటీని పెంచుతూ గ్రేటర్​ఆర్టీసీ అధికారులు ఆరు కొత్త పుష్పక్​ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. జేబీఎస్ ​నుంచి సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్, రాణిగంజ్, నాంపల్లి, సెక్రెటేరియెట్, రవీంద్రభారతి, హజ్​హౌస్, గాంధీభవన్, ఎంజేమార్కెట్, అఫ్జల్ గంజ్, బహదూర్​పురా, ఆరాంఘర్ మీదుగా ఎయిర్​పోర్టు వరకు వీటిని నడపనున్నారు. ప్రతిరోజు అర్ధరాత్రి దాటాక 12.55 గంటలకు జేబీఎస్​ నుంచి పుష్పక్​ బస్సులు మొదలవుతాయి. ఈ రూట్లలో గంటకో బస్సు నడుస్తుంది. ఎయిర్​పోర్టు నుంచి ఆఖరు బస్సు రాత్రి11.55కు ఉంటుంది.