
చత్తీస్ ఘడ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మార్చి 29న సుక్మాజిల్లా కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రత దళాలు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 16 మంది మావోలు మృతి చెందగా ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
సుక్మాజిల్లా గోగుండ కొండపై మావోలు ఉన్నట్లు పక్కా సమాచారంతో పోలీసు భద్రతా దళాలు మార్చి 29 తెల్లవారుజామున నుంచి కూంబింగ్ మొదలు పెట్టారు. మావోలు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు . ఈ ఎదురు కాల్పుల్లో 16మంది మావోలు మృతి చెందగా..ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
Also Read : కోల్కతా వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదు
సుక్మా-దంతేవాడ సరిహద్దులోని ఉపంపల్లి కెర్లపాల్ ప్రాంతంలోని అడవిలో ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఎస్పీ సుక్మా కిరణ్ చవాన్ తెలిపారు .మార్చి 28న రాత్రి ప్రారంభించిన ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. గోగుండ అటవి ప్రాంతంలో ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.
మూడు నెలల్లో వంద మందికి పైగా మావోలను హతమార్చాయి భద్రతా బలగాలు. 2026 లోపు దేశంలో మావోలు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మావోల ఏరివేత లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తోంది.