- సిటీకి చెందిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో రూ. 5. 40 కోట్లు డిపాజిట్
- దుబాయి కేంద్రంగా నెట్ వర్క్
- ముగ్గురిని అరెస్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు
హైదరాబాద్,వెలుగు : సైబర్ క్రిమినల్స్ కు బ్యాంక్ అకౌంట్లు అందించిన ముగ్గురిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) అధికారులు అరెస్ట్ చేశారు. గత నెల 29న సిటీలో నమోదైన కేసులో రూ.5.40 కోట్లు డిపాజిట్ చేసిన అకౌంట్లు, విత్ డ్రా వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ మంగళవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
ఓల్డ్ సిటీలోని కిషన్ బాగ్కు చెందిన జొమాటో డెలివరీ బాయ్ మహ్మద్ ఇలియాస్(38), ర్యాపిడో డ్రైవర్ కార్వాన్కు చెందిన మహ్మద్ రిజ్వాన్(32)తలాబ్ కట్టకు చెందిన కార్ సేల్స్ అండ్ సర్వీసెస్ చేసే సయ్యద్ గులామ్ అక్సరీ(42)లను నిందితులుగా గుర్తించి మంగళవారం రిమాండ్కు పంపారు. గులామ్ అక్సరీ సోదరుడు గులామ్ ముస్తఫా దుబాయ్లో ఉంటూ ఇండియా అకౌంట్స్ను ఆపరేట్ చేస్తున్నాడు.
ALSO READ : ఫ్యాక్టరీలో గోల్ మాల్: తీసుకోని లోన్కు రుణమాఫీ మెసేజ్లు.. షాకైన రైతులు
అక్కడి సైబర్ క్రిమినల్స్ తో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. వీటిని చైనా, కంబోడియా దేశస్తులు ఆపరేట్ చేస్తున్న సైబర్ నేరాలకు అందిస్తున్నాడు. ఇలా గులామ్ అక్సరీ తన సోదరుడికి 17 బ్యాంక్ అకౌంట్లను అందించాడు. వీరి అకౌంట్స్లో డిపాజిట్ అయిన డబ్బులో10 శాతం కమీషన్, ప్రతి విత్ డ్రాకు రూ.20వేలు తీసుకుని మిగతా డబ్బును గులామ్ అక్సరీకి అందిస్తుండగా.. అతను క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయిలోని ముస్తఫాకు పంపిస్తున్నాడు. ఇలా 17 అకౌంట్స్ నుంచి రూ.1.34 కోట్లు విత్ డ్రా చేశారు. బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా ముగ్గురిని సీఎస్బీ అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయిలోని ముస్తఫాపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.