సిక్కుల ఊచకోత కేసులో దోషిగా మాజీ ఎంపీ సజ్జన్.. నిర్ధారించిన ఢిల్లీ హైకోర్టు

సిక్కుల ఊచకోత కేసులో దోషిగా మాజీ ఎంపీ సజ్జన్.. నిర్ధారించిన ఢిల్లీ హైకోర్టు
  • ఈ నెల 18న శిక్షపై వాదనలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు చెప్పింది. కాంగ్రెస్ సీనియర్​ నేత,​ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్​ను  దోషిగా తేల్చింది. ఈ మేరకు మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సజ్జన్​కుమార్​ను​ బుధవారం కోర్టులో ప్రవేశపెట్టగా.. స్పెషల్​ జడ్జి కావేరి బవేజా.. అతడిని దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పారు. అయితే, శిక్ష ఖరారుపై వాదనలను ఈ నెల 18కి వాయిదా వేశారు.

సిక్కు వ్యతిరేక అల్లర్ల సందర్భంగా1984 నవంబర్​1న నార్త్​ వెస్ట్​ఢిల్లీలోని సరస్వతీ విహార్​ ప్రాంతంలో జస్వంత్​సింగ్​, ఆయన కొడుకు తరుణ్​దీప్​సింగ్​ హత్యలో సజ్జన్​కుమార్​ప్రమేయం ఉన్నట్టు అభియోగాలున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పంజాబీ బాఘ్​పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేశారు. అనంతరం ఈ కేసుపై సిట్​ఇన్వెస్టిగేషన్​ చేపట్టింది. మరోవైపు.. 2021 డిసెంబర్‌‌‌‌ 16న సజ్జన్‌‌‌‌ కుమార్‌‌‌‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం..
ప్రాసిక్యూషన్​ ప్రకారం.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద సమూహం మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, ఆస్తుల ధ్వంసం, ఇండ్ల దహనాలకు పాల్పడింది. ఈ క్రమంలోనే సరస్వతి విహార్‌‌‌‌ ప్రాంతంలో ఓ అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌‌‌‌ను హతమార్చినట్టు జస్వంత్​ భార్య కంప్లయింట్​ చేసింది. అయితే..  సజ్జన్ కుమార్ ఈ అల్లర్లలో పాల్గొనడమే కాకుండా ఆ గుంపుకు నాయకత్వం వహించాడని కోర్టు పేర్కొంది. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపింది.

కఠినంగా శిక్షించాలి: బాధిత కుటుంబం
కాంగ్రెస్​ మాజీ ఎంపీ సజ్జన్​కుమార్​ను కోర్టు దోషిగా తేల్చడాన్ని బాధిత కుటుంబం, సిక్కు నాయకులు స్వాగతించారు. అతడికి కఠిన శిక్ష విధించాలని కోర్టును కోరారు. 1984 లో జరిగింది సిక్కు అల్లర్లు కాదని, సిక్కు మారణహోమం అని తెలిపారు. ‘‘సిక్కులను క్రమపద్ధతిలో లక్ష్యంగా చేసుకుని హత్య చేశారు. ఈ నెల 18న సజ్జన్​కుమార్​కు మరణశిక్ష పడాలని మేం కోరుకుంటున్నాం.

అమాయక కుటుంబాన్ని తగలబెడితే మరణ శిక్ష తప్పదని నేరస్థులందరికీ తెలియాలి’’ అని అన్నారు. అతడికి ఉరిశిక్ష పడ్డప్పుడే న్యాయం గెలిచినట్టని పేర్కొన్నారు. కాగా, ఈ తీర్పును ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్​ కమిటీ (డీఎస్‌‌‌‌జీఎంసీ) ప్రధాన కార్యదర్శి జగ్‌‌‌‌దీప్ సింగ్ కహ్లాన్ స్వాగతించారు.