
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి దగ్గర గుర్తుతెలియని బాక్స్ కలకలం రేపింది. మమతా బెనర్జీ ఇంటికి 500 మీటర్ల దూరంలో ఈ బాక్స్ కనిపించింది. ఆ బాక్స్లో బాంబులు ఉన్నాయేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు.
మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి బాక్సే కనిపించింది. దీంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. అభిషేక్ బెనర్జీ ఇంటికి వెళ్లే అన్ని దారులను మూసివేశారు. బాంబు స్క్వాడ్ ఈ రెండు స్పాట్స్కు చేరుకుని పరిశీలించారు. అయితే.. ఆ రెండు బాక్సుల్లో మెడిసిన్స్ కనిపించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఇలా ఎవరికీ తెలియకుండా బాక్సులు పెట్టిన ఘటన మాత్రం షాక్కు గురిచేసింది.
పైగా.. కోల్కత్తా నగరంలోనే సేఫెస్ట్ ప్లేస్గా ఈ ఏరియాకు పేరుంది. అలాంటి ప్రాంతంలో రెండు బాక్సులు ఎవరి కంటా పడకుండా, పోలీసుల కళ్లుగప్పి పెట్టడంతో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. సోమవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఈ ప్రాంతంలో స్థానికంగా ఉంటున్న ఒకరు ఆ బాక్సులను గమనించారు. ఆ తర్వాత అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో ఆ బాక్సుల్లో చాలా మెడిసిన్స్ ఉన్నట్లు తేల్చారు. ఇదిలా ఉండగా.. 2026లో వెస్ట్ బెంగాల్ లో జరగబోయే ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని అభిషేక్ బెనర్జీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.