- మహబూబాబాద్ జిల్లాలో పట్టుకున్న పోలీసులు
తొర్రూరు, వెలుగు : కారులో తరలిస్తున్న 200 కిలోల గంజాయిని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజార స్టేజీ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. బుధవారం తొర్రూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజార స్టేజీ సమీపంలో ఎక్సైజ్ స్పెషల్ పోలీసులు రూట్వాచ్ చేస్తుండగా ఓ కారును ఆపాలని కోరారు. ఆపకపోవడంతో పోలీసులు కారును చేజ్ చేస్తుండగా కారు టైర్ పంక్చర్ అయి పల్టీ కొట్టింది.
పోలీసులు వెళ్లి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కారులో తనిఖీ చేయగా వంద ప్యాకెట్లలో 200 కిలోల గంజాయి దొరికింది. దీని విలువ రూ.40 లక్షలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా సిద్ధాపురం గ్రామానికి చెందిన కుంచల జయచంద్రగా గుర్తించారు. రంపచోడవరం నుంచి గంజాయిని తొర్రూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.