నాగ్పూర్ : విదర్భతో రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ను విజయం ఊరిస్తోంది. కెప్టెన్ కరుణ్ నాయర్ (105) సెంచరీతో సత్తా చాటడంతో ఓవర్నైట్ స్కోరు 56/2తో మూడో రోజు, శనివారం ఆట కొనసాగించిన విదర్భ రెండో ఇన్నింగ్స్లో 95.2 ఓవర్లలో 355 వద్ద ఆలౌటైంది. హైదరాబాద్కు 220 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్ అథర్వ తైడే (93), హర్ష్ దూబే (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.
హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సీవీ మిలింద్, తనయ్, రక్షణ్ రెడ్డి తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం టార్గెట్ ఛేజింగ్లో మూడో రోజు చివరకు హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 23/1 స్కోరుతో నిలిచింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (6) ఔటవగా.. అభిరథ్ రెడ్డి (9 బ్యాటింగ్), తనయ్ త్యాగరాజన్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ విజయానికి ఆఖరి రోజు మరో 197 రన్స్ కావాలి.