
ములుగు, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన 22 మంది శుక్రవారం ములుగు ఎస్పీ షబరీశ్ ఎదుట లొంగిపోయారు. వీరిలో ముగ్గురు అసిస్టెంట్ కమాండెంట్లు (ఏసీఎం) ఉండగా, ఒకరు పార్టీ మెంబర్, మిగిలిన 18న మంది పూజారీ కాంకేర్ (ఆర్పీసీ) సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెం గ్రామానికి చెందిన మడవి మాస, చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా మల్లంపేటకు చెందిన ముచ్చకి జోగారామ్ అలియాస్ జోగా, తుమ్మిరిగూడ గ్రామానికి చెందిన తాటి జోగా ఉన్నారు.
వీరు పలు హింసాత్మక ఘటనల్లో, సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన ఘటనల్లో పాల్గొన్నట్లు ఎస్పీ షబరీశ్ తెలిపారు. మావోయిస్ట్ అగ్రనేతలు సైతం అజ్ఞాతం వీడి స్వచ్చంధంగా లొంగిపోయి కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలని సూచించారు. లొంగిపోయిన వారికి ఉపాధి, పునరావాసం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఆర్పీఎఫ్ పీఎంజీ పంచమీలాల్, ములుగు డీఎస్పీ రవీందర్, వెంకటాపురం సీఐ బండారుకుమార్, పస్రా సీఐ జి.రవీందర్, వెంకటాపురం ఎస్సై తిరుపతి, కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్ ఉన్నారు.