తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు

తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు
  • వరదలతో  ఇప్పటివరకు 29 మంది మృతి 
  • సహాయ, పునరావాస చర్యలపై ఎల్లుండి హైలెవల్​ మీటింగ్ 

 హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్టు సీఎస్​ శాంతి కుమారి తెలిపారు. ఇప్పటికే 4 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి, తగిన సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు నిధులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు విడుదల చేశామని,  మిగిలిన 25 జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున కలెక్టర్లకు నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై  సోమవారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 

శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అర్వింద్​కుమార్, వికాస్ రాజ్ తోపాటు పలువురు ముఖ్య కార్య దర్శులు, కార్యదర్శులు కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల నమోదైన వర్షపాతం ఆధారంగా ఈ 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటించామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్​గిరి, సిరిసిల్ల జిల్లాలు మినహా అన్నింటినీ వర్ష ప్రభావిత జిల్లాలుగా ప్రకటించామని వివరించారు. 

వర్షాలతో ఏర్పడ్డ నష్టాలు, చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు, అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై సీఎం అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వరదలు, వర్షాల వల్ల  జరిగిన నష్టాల వివరాలను నిర్ణీత నమూనాలో సమర్పించేందుకుగాను జిల్లాల వారీగా సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో వరదలతో ఇప్పటివరకు 29 మంది మరణించారని, వీరికి ఎక్స్ గ్రేషియా అందించేందుకు వివరాలు పంపాలని తెలిపారు.