
- పది జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు నమోదు
- నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
- అన్ని జిల్లాల్లోనూ దంచికొడ్తున్న ఎండలు
- మరో రెండు రోజుల పాటు మరింత తీవ్రంగా హీట్వేవ్స్
- నేడు 11 జిల్లాలకు.. రేపు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వడగాడ్పులు మరింత తీవ్రమయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ భారీ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ సెగలు ఎక్కువ కావడంతో ప్రజలు అడుగు బయట పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఎండ దెబ్బకు ప్రాణాలు పోతున్నాయి. బుధవారం మహబూబాబాద్ జిల్లా మదనతుర్తి గ్రామంలో ఓ రైతు వడ్ల కుప్పపైనే ప్రాణాలు వదలడం స్థానికులను కంటతడి పెట్టించింది.
సోమవారం 9 మంది, మంగళవారం ఐదుగురు, బుధవారం ఐదుగురు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఈ మూడు రోజుల్లోనే 19 మంది ఎండ దెబ్బతో చనిపోయారు. కాగా, మరో రెండు రోజుల పాటు వడగాడ్పుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల (11 జిల్లాలు)కు రెడ్ అలర్ట్ ఇచ్చింది.
మిగతా అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ను ఇష్యూ చేసింది. శుక్రవారానికి ఆదిలాబాద్, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల (7 జిల్లాలు)కు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ఈ అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదయ్యే ప్రమాదముందని, వడగాడ్పులు అధికంగా సంభవిస్తాయని హెచ్చరించింది. అయితే, గురువారం హైదరాబాద్ సిటీ, శుక్రవారం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా నమోదవుతుందని వెల్లడించింది.
10 జిల్లాల్లో హై టెంపరేచర్స్
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఎండలు ఠారెత్తించాయి. అని జిల్లాల్లోనూ 41 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 10 జిల్లాల్లో 44 డిగ్రీలకన్నా ఎక్కువ టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్ జిల్లా మావల, నిజామాబాద్ జిల్లా మెండోరాల్లో 44.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మంచిర్యాలలో 44.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 44.2, జగిత్యాల, కుమ్రంభీ ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 44.1, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 44 డిగ్రీల చొప్పున హై టెంపరేచర్లు రికార్డయ్యాయి. 8 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా, 12 జిల్లాల్లో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య, మరో 3 జిల్లాల్లో 41.6 నుంచి 41.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బుధవారం ఐదుగురు మృతి
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వడదెబ్బతో ఐదుగురు మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామానికి చెందిన బిర్రు వెంకన్న (56), నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్ట గ్రామానికి చెందిన గుమ్మల గంగారాం (40), వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటలో నాంపెల్లి రవళి (36) అనే వివాహిత, వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామ శివారు గల రైల్వే ట్రాక్ సమీపంలో ఓ వ్యక్తి వడ దెబ్బ తగిలి మృతి చెందాడు. మృతుడు 50 నుంచి 55 ఏండ్ల మధ్య వయస్సు ఉంటాడని, ఐదడుగుల ఎత్తు, ఒంటిపై తెల్ల రంగు బనియన్, నీలి రంగు చెక్స్ కలిగిన లుంగీ ఉన్నాయని పోలీసులు తెలిపారు.