
తెలంగాణ ఆర్టీసీ మహాశివరాత్రి వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవ క్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి కాబట్టి.. 24 నుంచి 28వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుస్తాయని వెల్లడించింది . గత శివరాత్రి కన్నా ఈ సారి 809 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది.
ఏక్కడి నుంచి ఎన్ని బస్సులు
భక్తుల సౌకర్యార్థం 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప వంటి ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది.
Also Read :- యూరియా కోసం రైతుల తిప్పలు.. క్యూ లైన్లలో చెప్పులు
టికెట్ రేట్లలో సవరణలు
రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.ఫిబ్రవరి 24 నుంచి 27 తేది వరకు (నాలుగు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 26 నుంచి 28 తేది వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుంది.
అన్ని బస్సుల్లో మహిళలకు ఫ్రీ
మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. స్పష్టం చేశారు. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని, టికెట్ల బుకింగ్ ను www.tgsrtcbus.in వెబ్సైట్ లో చేసుకోవచ్చని అన్నారు. మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు