కుంభమేళా చుట్టూ 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జాం : సరిహద్దులు మూసివేసిన రెండు రాష్ట్రాలు

కుంభమేళా చుట్టూ 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జాం : సరిహద్దులు మూసివేసిన రెండు రాష్ట్రాలు

మన హైదరాబాద్ లో కాదు.. బెంగళూరులోనే కాదు.. ఢిల్లీలో అంతకన్నా కాదు.. ప్రపంచలోనే అతి పెద్ద ట్రాఫిక్ జాం మన ఇండియాలోనే.. 300 కిలోమీటర్లు ట్రాఫిక్.. ఎక్కడి వాహనాలు అక్కడే.. ఎటు వెళ్లాలన్నా దారి లేదు.. ప్రతిదారిలోనూ వాహనాలే.. రోడ్డు పక్కన పార్కింగ్ చేసుకుని తీరిగ్గా వెళ్దామని అనుకున్నా.. వాహనాలు పార్క్ చేయటానికి స్థలం కూడా లేదు. దీంతో రోడ్లపై గంటలు గంటలు వాహనాల్లోనే ప్రజలు నరకం చూస్తున్నారు. ఇదంతా మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ లో.. కుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమానికి వచ్చే అన్ని రహదారుల్లోనూ ట్రాఫిక్ బీభత్సంగా ఉంది.

కుంభమేళాకు వెళ్లే అన్ని రూట్లలో 300 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జాం ఉందని.. సాధారణ రోజుల్లో 20 నిమిషాల జర్నీ.. ఇప్పుడు ఆరు, ఏడు గంటల సమయం పడుతుందని.. లక్షల మంది వాహనాల్లోనే చిక్కకున్నారని యూపీ ట్రాఫిక్ డీసీపీ కుల్దీప్ సింగ్ ప్రకటించటం విశేషం. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ, మైహార్, జబల్ పూర్ నుంచి కుంభమేళాకు వచ్చే రహదారులను మూసివేసినట్లు ప్రకటించారు యూపీ ట్రాఫిక్ అధికారులు. మౌని అమావాస్య తరహాలోనే రద్దీ విపరీతంగా ఉందని.. ఇప్పటికే కుంభమేళాలో పార్కింగ్ కోసం కేటాయించిన అన్ని స్థలాలు నిండిపోయాయని.. అందుకే మధ్యప్రదేశ్, యూపీ సరిహద్దులను మూసివేసినట్లు వెల్లడించారు. కుంభమేళా నుంచి బయటకు వచ్చే వాహనాలను అంచనా వేసి.. అప్పుడు పంపిస్తామని ప్రకటించారు. దీంతో సరిహద్దుల్లో వాహనాల్లో చిక్కుకుపోయిన వారికి ఆహారం, మంచినీళ్లు అందించటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని.. ఎవరూ భయపడొద్దని.. ఆందోళన చెందొద్దని ప్రకటించింది యూపీ సర్కార్.

కుంభమేళా ప్రాంతం చుట్టూ 30 వేల వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించాం అని.. ఇప్పుడు అక్కడ కూడా నిండిపోయిందని.. వాహనాలను రాష్ట్ర సరిహద్దుల్లోనే.. రోడ్లపై నిలిపివేయటం తప్ప.. మరో మార్గం లేదంటున్నారు యూపీ అధికారులు.

ఓవరాల్ గా అలహాబాద్ కు వచ్చే అన్ని మార్గాల్లో.. ఏకంగా 300 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ జాం ఏర్పడింది.. ఆరు, ఏడు లక్షల మంది జనం ఆయా రహదారుల్లో కుంభమేళాకు వచ్చేందుకు వాహనాల్లోనే ఉండిపోయారు. పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కుంభమేళా ముగింపు దశకు కూడా రావటంతో.. ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తుండటంతో రద్దీ విపరీతంగా పెరిగిందంటున్నారు అధికారులు. 

ఇప్పుడు అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జాం.. మన కుంభమేళాలోనే అంటున్నారు నెటిజన్లు.