
రాజన్న సిరిసిల్ల,వెలుగు: కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం జిల్లాలో 342.36 హెక్టార్ల భూమిని సేకరించామని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. బుధవారం ఆయన సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ రాజన్న జిల్లాలో 40 కి.మీ మేర ఉందని, దీనికి సంబంధించి 386.21 హెక్టార్లు సేకరించాల్సి ఉండగా.. ఇప్పటికే 342.46 హెక్టార్లు రైల్వే శాఖకు బదిలీ చేశామన్నారు.
పెండింగ్ సేకరణకు సంబంధించి 15.21 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ భూములను రైల్వే శాఖకు అప్పగించామన్నారు. దాని బదులు అటవీ శాఖకు కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో 38.05ఎకరాలను కేటాయించినట్లు చెప్పారు. భూసేకరణకు రూ.68.80 కోట్లు పీడీ అకౌంట్లో జమ అయ్యాయని, ప్రభుత్వ ఆమోదం తర్వాత నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. సమావేశంలో ఇండస్ట్రీస్ జీఎం హనుమంతు, సూపరింటెండెంట్ శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.
బొప్పాపూర్ లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఎల్లారెడ్డిపేట, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో వడ్లకు మద్దతు ధర దక్కుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ఏఎంసీలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 191 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో డీఏవో అఫ్జలి బేగం, డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్ సుజాత, ఏఎంసీ చైర్పర్సన్ సాబేరా బేగం, వైస్ చైర్మన్ రాంరెడ్డి పాల్గొన్నారు.