బీహార్​లో విషాదం.. నీట మునిగి 46 మంది మృతి

బీహార్​లో విషాదం.. నీట మునిగి 46 మంది మృతి
  • జితియా పండుగ సందర్భంగా పుణ్యస్నానాలు  చేస్తుండగా ప్రమాదాలు
  • మృతుల్లో 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు
  • మృతుల ఫ్యామిలీలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌‌‌‌గ్రేషియా

పాట్నా: బిహార్‌‌లో ‘జివిత్ పుత్రిక(జితియా)’ పండగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. పండుగలో భాగంగా వేరువేరు ప్రాంతాల్లోని నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఏకంగా 46 మంది నీటిలో మునిగి మరణించారు. మృతుల్లో 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు ఉన్నారు. జితియా పండుగ సందర్భంగా తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉంటారు. పిల్లలతో కలిసి సమీపంలోని నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ  46 మంది చనిపోయారు. ఈస్ట్ అండ్ వెస్ట్ చంపారన్, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌‌పూర్, సమస్తిపూర్, గోపాల్‌‌గంజ్, అర్వాల్ జిల్లాల్లో ఈ ఘటనలు జరిగాయి. నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ 46 మంది చనిపోవడంపై సీఎం నితీశ్‌‌ కుమార్‌‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4  లక్షల చొప్పున ఎక్స్‌‌గ్రేషియా ప్రకటించారు.