ఘోర విషాదం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి..

ఘోర విషాదం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి..

కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో విషాద ఘటన జరిగింది. పథార్ ప్రతిమ పరిధిలోని ధోలాఘాట్ గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. సిలిండర్ పేలుడు తీవ్రతకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.

అర్ధరాత్రి భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 11 మంది ఉన్నారని అంచనా.. ఈ ఇంటిని బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారని స్థానికులు చెప్పుకొచ్చారు.

చనిపోయిన ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న మహిళను స్థానికులు కాపాడారు. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఒక్క గ్యాస్ సిలిండర్ అయితే ఇంత పేలుడు సంభవించి ఉండదని, రెండు గ్యాస్ సిలిండర్లు పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.