
హైదరాబాద్ మెహిదీపట్నం ఆసిఫ్ నగర్ పరిధిలోని సంతోష్ నగర్ లో దారుణం జరిగింది. ఓ అపార్ట్ మెంట్ లోని లిఫ్ట్ లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.
అసలేం జరిగిందంటే? సంతోష్ నగర్ లో ఆరు అంతస్తులున్న ఓ అపార్ట్ మెంట్ లో హాస్టల్ నిర్వహిస్తున్నారు. లిఫ్ట్ పక్కనే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న చిన్నగదిలో శ్యామ్ బహదూర్ కుటుంబం ఉంటోంది. మార్చి 12 బుధవారం రాత్రి 10 గంటల సమయంలో సురేందర్ అనే బాలుడు ఆడుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో తలుపుల మధ్యకు వెళ్లగా.. పైన ఎవరో లిఫ్ట్ నొక్కారు. తలుపులు మూసుకుపోకముందే లిఫ్ట్ పైకి దూసుకెళ్లింది. దీంతో లిఫ్ట్ లోనే ఆ పసిప్రాణం నలిగిపోయింది. కాసేపటికే సురేందర్ ఎక్కడా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకడంతో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని రక్తపుమడుగులో అపస్మారకస్థితిలో కనిపించాడు. తల్లిదండ్రులు రోదిస్తుండగానే.. అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే వచ్చి లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడిని హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సురేందర్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడంతో తల్లిదండ్రుల కన్నీటి పర్యంతం అయ్యారు.
తెలంగాణలో ఈ మధ్య లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల నాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. సిరిసిల్లలో ఓ పోలీస్ కమాండెంట్ లిఫ్ట్ లో పడి చనిపోయాడు. హైదరాబాద్ లో చాలా అపార్ట్ మెంట్స్ లో సరైన నాణ్యత ప్రమాణాలు లేకుండానే లిఫ్ట్ లు నడుస్తుననాయి. ఇళ్లలో వాడే లిఫ్ట్ అయితే దాని సామర్థ్యం 204 కేజీలు ఉండాలి. రెసిడెన్షియల్ ఎలివేటర్ను ఇన్స్టాల్ చేయడానికి కనీసం 20 నుంచి 25 చదరపు అడుగుల ప్రాంతం ఉండాలి. దీంతో పాటు 8 చదరపు అడుగుల పిట్ ఏరియా కూడా తప్పనిసరిగా ఉండాలి..ప్రతినెలా కచ్చితంగా సర్విస్ చేయించుకోవాలి...కచ్చితంగా అలారమ్స్ ఉన్న లిఫ్ట్ లే వాడాలి..