
- దాదాపు 90% నివేదిక పూర్తి
- విజిలెన్స్ రిపోర్ట్ స్టడీ చేస్తున్న కమిషన్
- ఈ నెలాఖరుతో ముగియనున్న కమిషన్ టెన్యూర్
- మరో మారు కమిషన్ గడువు పెంచనున్న ప్రభుత్వం!
- ఇంజినీర్ల అఫిడవిట్ల ఆధారంగా ప్రశ్నించే అవకాశం
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్టు రెండు మూడు వారాల్లో పూర్తి కానుంది. ప్రస్తుతం కమిషన్ విజిలెన్స్ రిపోర్టును స్టడీ చేస్తోంది. ఇప్పటి వరకు వివిధ కోణాల్లో ఇంజినీర్లను, నిర్మాణ సంస్థలను ప్రశ్నించి వారి వద్ద నుంచి అఫిడవిట్లను స్వీకరించిన కమిషన్ త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు అప్పటి మంత్రులు హరీశ్ రావు, ఈటల ను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అక్రమాలపై విచారణ కోసం గత ఏడాది మార్చి 12న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో విచారణ ఆలస్యం అవుతుండటంతో ఇప్పటికే పలుసార్లు కమిషన్ గడవును పొడిగించగా ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈనేపథ్యంలో మరోసారి ప్రభుత్వం కమిషన్ గడవు పొడిగించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం విచారణ కీలక దశకు చేరుకుంది. కమిషన్ తుది దశ విచారణను ఇవాళ ప్రారంభించింది.
ఇప్పటికే అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులను ప్రశ్నించిన కమిషన్ దాని ఆధారంగా 400 పేజీల నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. దాదాపు 90 శాతం రిపోర్టు పూర్తిచేసిన కమిషన్ ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తది నివేదిక కోసం ఎన్డీఎస్ఏకు మరోసారి లేఖ రాసింది. ఆ నివేదిక మరో మూడు వారాల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్టును అందజేయనుంది.