
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు అందించేందుకు ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) జపాన్లోని టెర్న్, రాజ్ గ్రూప్ సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నది. ఈ ఒప్పందాలు ఒకటీ రెండేండ్లలో సుమారు 500 ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర యువతకు అందించనున్నాయి.
జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ బృందం టెర్న్ గ్రూప్ (టీజీయూకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్), రాజ్ గ్రూప్ ప్రతినిధులతో చర్చలు జరిపి ఈ ఒప్పందాలను ఖరారు చేసింది. టోక్యోలో శనివారం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. దీంతో రెండేండ్లలో మన యువతకు జపాన్లో 500 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
హెల్త్కేర్, నర్సింగ్ రంగంలో 200 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ (ఆటోమోటివ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ఐటీ)లో 100 ఉద్యోగాలు, హాస్పిటాలిటీలో 100 ఉద్యోగాలు, నిర్మాణ రంగం (సివిల్ ఇంజనీరింగ్, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామగ్రి నిర్వహణ, నిర్వహణ) మరో 100 ఉద్యోగాలు రానున్నాయి.