గవర్నమెంట్ జూనియర్​ కాలేజీల్లో.. లెక్చరర్ల కొరతకు చెక్

 గవర్నమెంట్ జూనియర్​ కాలేజీల్లో.. లెక్చరర్ల కొరతకు చెక్
  • కామారెడ్డి జిల్లాకు కొత్తగా 52 మంది జూనియర్​ లెక్చరర్లు 
  • గవర్నమెంట్ జూనియర్​ కాలేజీల్లో మెరుగుపడనున్న బోధన 

కామారెడ్డి, వెలుగు: గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీల్లో విద్య బోధన మెరుగుపడనుంది. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న జూనియర్​ లెక్చరర్​ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. జెఎల్​గా సెలక్టయినవారికి ఈ నెల 12న అపాయింట్​మెంట్​ లెటర్లు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో కొత్తగా 52 మంది జూనియర్​ లెక్చరర్లు డ్యూటీలో చేరనున్నారు. దీంతో జిల్లాలో సబ్జెక్టు లెక్చరర్ల కొరత తీరనుంది. జిల్లాలో 20 గవర్నమెంట్​జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. ఇందులో బీబీపేట, నాగిరెడ్డిపేట, బీర్కూరు, నిజాంసాగర్​ లలో 2020 తర్వాత కాలేజీలు ప్రారంభించారు.

 ఈ కాలేజీలకు ఇప్పటివరకు లెక్చరర్లను డిప్యూటేషన్​ మీద పంపారు. కొందరు గెస్ట్​ లెక్చరర్లు పని చేస్తున్నారు. జిల్లాకు కొత్తగా వస్తున్న 52 మందిని 16 పాత కాలేజీలకే కేటాయించారు. కొత్త కాలేజీల్లో ఇంకారెగ్యులర్​ పోస్టులు భర్తీ చేయలేదని, త్వరలో పోస్టులు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో జూనియర్​ కాలేజీల్లో ప్రస్తుతం 2,144 మంది ఫస్ట్​ఇయర్​, 2,129 మంది సెకండియర్​ స్టూడెంట్లు చదువుకుంటున్నారు. 16 కాలేజీల్లో ఇప్పుడు 150 మంది రెగ్యులర్​ లెక్చరర్లు ఉన్నా.. ఇంకా చాలా చోట్ల మ్యాథ్స్​, ఇంగ్లిష్​, ఎకనామిక్స్​ కెమిస్ట్రీ, బాటనీ, కామర్స్​తదితర సబ్జెక్ట్​ లెక్చరర్ల కొరత ఉంది. ఈ కొరత తీర్చేందుకు జిల్లాకు 52 మంది సబ్జెక్ట్​ లెక్చరర్లను కేటాయించారు. 16 కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వీరితో భర్తీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో అన్ని కాలేజీల్లో పూర్తి స్థాయిలో సబ్జెక్టు లెక్చరర్లు ఉండనున్నారు. 

 గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీల్లో అన్ని సబ్జెక్టుల లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉండడంవల్ల 2024 లో జిల్లాలో ఆశించిన స్థాయిలో రిజల్ట్స్​ రాలేదు. గవర్నమెంట్​ కాలేజీల్లో కేవలం 30 శాతం మంది మాత్రమే పాస్​అయ్యారు. ఈ సమస్యను గుర్తించి కలెక్టర్​ అశిశ్​సంగ్వాన్​ ఈ సారి స్పెషల్​ఫోకస్ పెట్టారు. రెగ్యులర్​గా స్టూడెంట్స్​కాలేజీకి వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు కాలేజీల వారీగా పేరెంట్స్​ మీటింగ్ లు ఏర్పాటు చేశారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన స్టూడెంట్స్​కు స్పెషల్​ క్లాసులు చెప్పించారు. వచ్చే ఏడాది ఈ సమస్య ఉండదు. బోధన మెరుగ్గా జరిగి పాస్​ పర్సంటేజీ పెరిగే చాన్స్​ ఉంది. గతంలో కొన్ని కాలేజీల్లో సరిపడా లెక్చరర్లు లేక గవర్నమెంట్​ కాలేజీల్లో చేరేందుకు స్టూడెంట్స్​ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు పోస్టులు భర్తీ కావటంతో అడ్మిషన్​కూడా పెరుగుతాయని అధికారులు అంటున్నారు. 

 మంచి బోధన అందనుంది

 కాలేజీల్లో ఖాళీగా ఉన్న జూనియర్​ లెక్చరర్ల పోస్టుల కొరత తీరింది. కొత్తగా 52 మంది లెక్చరర్లు వస్తుండటంతో మంచి బోధన అందనుంది. ఇక సబ్జెక్టు లెక్చరర్ల సమస్య ఉండదు. వచ్చే అకాడమిక్​ ఇయర్​లో అడ్మిషన్లను పెంచటంతో పాటు, మంచి ఫలితాలు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.‌‌‌‌‌‌‌‌- షేక్​సలాం, ఇంటర్మీడియట్​​ నోడల్ అధికారి