అది ఓ రైల్వేస్టేషన్..ప్లాట్ఫాంపై ప్యాసింజర్లంతా రైలు రాకకోసం ఎదురు చూస్తున్నారు.ఎక్కడినుంచి వచ్చిందోగానీ..ఓ పాము ప్లాట్ ఫాం మధ్యలో పాకుకుంటూ ప్యాసింజర్ల మధ్యకు వచ్చింది. మనుషులు తిరిగే ప్లాట్ఫాంపై పాము..అదీ పెద్దపాము..జర్రున జారుకుంటూ వేగంగా రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. రైళ్లల్ల మనుషులే ప్రయాణిస్తారా.. మేం కూడా ప్రయా ణం చేస్తాం.. అన్నట్లు ఆదరబాదరాగా ప్లాట్ ఫాంపై పాకుతూ జనాలను పరుగులు పెట్టించింది. అంత పెద్ద పామును చూసిన ప్యాసింజర్లు షాకయ్యారు. కొద్దిసేపటికి తేరుకు సెల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఉత్తరాఖండ్ లోని రిషికేష్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం ( సెప్టెంబర్ 20, 2024) పెద్ద పాము ప్రత్యక్షమయింది. పామంటే మామూలు పాము కాదు.. ఆరగులు పొడవుంది. 1వ నంబరు ప్లాట్ ఫాం పైకి వేగంగా పాకుతూ వచ్చింది. పామును చూసిన ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న రైల్వే స్టేషన్ మాస్టర్.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పామును పట్టి సురక్షితంగా సమీపంలో అడవిలో వదిలారు.
ఉత్తరాఖండ్లో ఉన్న రిషికేశ్ చాలా అందమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శిస్తారు. రిషికేశ్ను ప్రపంచవ్యాప్తంగా యోగానగరి అని కూడా పిలుస్తారు. రాజాజీ నేషనల్ పార్క్లో కొంత భాగం రిషికేశ్కు ఆనుకుని ఉంది. కాబట్టి ఇక్కడ పాములు కనిపించడం సర్వసాధారణం అంటున్నారు రైల్వే స్టేషన్ మాస్టర్.
రైళ్ల కోసం వేచి ప్రయాణికుల మధ్యకు పాము అకస్మాత్తుగా ట్రాక్లపై నుంచి రావడం కనిపించిందని.. భయంతో పరుగులు పెట్టామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.