
- వరంగల్లో నిర్వహించిన జాబ్మేళాలో మంత్రులు సురేఖ, సీతక్క
- భారీ సంఖ్యలో హాజరైన నిరుద్యోగులు
- స్వల్ప తొక్కిసలాట, ముగ్గురికి గాయాలు
వరంగల్/వరంగల్ సిటీ, వెలుగు : కేసీఆర్ పేదండ్ల పాలనలో 10 వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని, కాంగ్రెస్ వచ్చాక ఏడాదిలోనే 60 వేల మందికి జాబ్లు ఇచ్చామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. టాస్క్ తరఫున గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎంకే.నాయుడు కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన జాబ్మేళాను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించి దశల వారీగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉద్యోగ కల్పనలో రాష్ట్రం నంబర్ వన్ ప్లేస్లో నిలిచిందన్నారు. నిరుద్యోగుల పక్షాన నిలుస్తామన్న హమీ మేరకే.. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ, మరోవైపు జాబ్మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో దేశవిదేశాల నుంచి తెలంగాణకు పెట్టుపడులు తీసుకొస్తున్నామని చెప్పారు.
త్వరలో అంగన్వాడీ పోస్టుల భర్తీ : మంత్రి సీతక్క
త్వరలోనే 14 వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. నిరుద్యోగులు ఖాళీగా ఉండకుండా ఓ వైపు సర్కార్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూనే.. మరో వైపు ఉపాధి పొందే ప్రయత్నాలు చేయాలని సూచించారు.
వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని, నగరాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, టాస్క్ సీఈవో రెడ్డి పాల్గొన్నారు.