
- ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి ఫ్రీ విత్డ్రాలు ఇక మూడే
- కొన్ని క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ను ఆపనున్న ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్
- అమల్లోకి రానున్న పీపీఎస్ విధానం
న్యూఢిల్లీ: వచ్చే నెల ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త బ్యాంకింగ్ రూల్స్ కూడా అమల్లోకి రానున్నాయి. వీటిపై ఖాతాదారులు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్, సేవింగ్స్ ఖాతా నియమాలు, ఏటీఎం విత్డ్రాలకు సంబంధించి కొన్ని మార్పులు అమల్లోకి రానున్నాయి. పెనాల్టీలు పడకుండా ఉండాలంటే వీటి గురించి ముందుగానే తెలుసుకోవడం బెటర్.
కొత్త మార్పులు..
1) ఏటీఎం విత్డ్రా..
పలు బ్యాంకులు తమ ఏటీఎం విత్డ్రా విధానాలను సవరించాయి. ప్రతీ నెల అందుబాటులో ఉండే ఫ్రీ ఏటీఎం విత్డ్రాల సంఖ్య తగ్గింది. ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి మెట్రోల్లో అయితే ఐదు సార్లు ఫ్రీగా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ నెంబర్ ఏప్రిల్ 1 నుంచి మూడుకి తగ్గుతుంది. ఈ పరిమితిని దాటితే లావాదేవీకి రూ.20 నుంచి రూ.25 వరకు ఛార్జీ పడుతుంది.
2) మినిమమ్ బ్యాలెన్స్ అమౌంట్..
బ్యాంక్లు తమ మినిమమ్ బ్యాలెన్స్ నియమాలను సవరించాయి. సేవింగ్స్ అకౌంట్లలో కనీసం ఎంత అమౌంట్ మెయింటైన్ చేయాలనేది అకౌంట్ టైప్, బ్యాంక్, బ్రాంచ్ లొకేషన్ (అర్బన్ లేదా రూరల్) బట్టి మారుతుంది. అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే అదనపు ఛార్జీలు పడతాయి.
3) పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) అమలు
లావాదేవీల భద్రతను పెంచడానికి చాలా బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ని అమలు చేయనున్నాయి. కస్టమర్ రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన చెక్ను ఎవరికైనా ఇస్తే, ఈ చెక్లోని వివరాలను చెక్ ఇచ్చిన కస్టమర్ ఎలక్ట్రానికల్గా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఫ్రాడ్స్ను అరికట్టడానికి పీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. వెరిఫికేషన్లో చెక్ నంబర్, తేదీ, ఎవరికి చెల్లిస్తున్నారో వారి వివరాలు వంటివి నిర్ధారించాల్సి ఉంటుంది.
4) మెరుగ్గా డిజిటల్ బ్యాంకింగ్
డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి బ్యాంకులు కొత్త ఫీచర్లతో ఆన్లైన్ సర్వీస్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఏఐతో పనిచేసే చాట్బాట్లను పరిచయం చేయనున్నాయి. డిజిటల్ లావాదేవీలను రక్షించడానికి టు–ఫ్యాక్టర్ అథంటికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను మెరుగుపరచనున్నాయి.
5) సేవింగ్స్ ఖాతా, ఎఫ్డీ వడ్డీ రేట్లలో మార్పులు
పలు బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఏప్రిల్1 నుంచి సేవింగ్స్ అకౌంట్లలోని బ్యాలెన్స్ బట్టి పొందే వడ్డీ ఆధారపడి ఉంటుంది.
6) క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్లో మార్పులు
ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు తమ కో-బ్రాండెడ్ విస్తారా క్రెడిట్ కార్డ్లకు కొన్ని మార్పులు చేశాయి. ఎస్బీఐ సింపుల్ క్లిక్ స్విగ్గీ రివార్డ్స్ను సగానికి తగ్గించింది. ఎయిర్ఇండియా సిగ్నేచర్ పాయింట్స్ను 30 నుంచి 10 కి తగ్గించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్లబ్ విస్తారా మైల్స్టోన్ బెనిఫిట్స్ను ఆపేయనుంది.
7) పనిచేయని నెంబర్తో లింకైతే యూపీఐ బంద్
చాలా కాలం పాటు పనిచేయకుండా ఉన్న మొబైల్ నెంబర్లు యూపీఐ అకౌంట్లకు లింకై ఉంటే రికార్డుల నుంచి ఈ నెంబర్లను బ్యాంకులు తొలగించనున్నాయి. ఫలితంగా ఇటువంటి నెంబర్లతో లింకై ఉన్న యూపీఐ అకౌంట్లు ఏప్రిల్ 1నుంచి పనిచేయవు.