
- పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
- ఏడు హాల్స్.. 130 టేబుల్స్
- ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ..ఆ తర్వాత ఈవీఎంలు
నిజామాబాద్, వెలుగు : జూన్ 4న జరిగే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఆఫీసర్లు ఎన్ని ఏర్పాట్లు చేశారు. డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ)లో ఉదయం 6 గంటలకు కౌటింగ్ప్రక్రియ మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ పూర్తి కావడానికి కనీసం 8 గంటల సమయం పడుతుందని అంచనా.
అరగంటకో రౌండ్
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 17,04,867 మంది ఓటర్లుండగా 71.92 శాతం పోటింగ్ నమోదైంది. 12,26,133 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. ఇందులో 7,414 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. 724 సర్వీస్ ఓట్లు ఉండగా ఇప్పటికి 311 అందాయి. కౌంటింగ్నాడు పొద్దున 8 గంటల దాకా అందే సర్వీస్ ఓట్లును స్వీకరిస్తారు. ఉదయం 7 గంటలకు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్సమక్షంలో పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కోరౌండ్ ఈవీఎం కౌంటింగ్ ముగిసిన తర్వాత పారదర్శకత కోసం ర్యాండమ్గా రెండు వీవీ ప్యాట్లలోని స్లిప్లను లెక్కిస్తారు.
అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఏఆర్వోలు ప్రతి రౌండ్కు రిజల్ట్ ప్రకటిస్తారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్కు అరగంట టైం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన కౌంటింగ్పూర్తి కావడానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. ప్రతి టేబుల్ దగ్గర ఒక్కో అభ్యర్థి తరఫున ఒక్కో ఏజెంట్కు పాస్ ఇస్తారు. ప్రతి టేబుల్వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్తో పాటు మైక్రో అబ్జర్వర్ను అపాయింట్ చేశారు. 25 శాతం రిజర్వు స్టాఫ్ ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్గా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు వ్యవహరిస్తారు.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏడుగురు ఏఆర్వోలు కౌంటింగ్ బాధ్యతలు నిర్వహిస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్నుంచి కౌంటింగ్ను నేరుగా పర్యవేక్షించేందుకు వీలుగా హాళ్లకు సీసీ కెమెరా లు ఏర్పాటు చేశారు. ఎజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఎవరూ లోపలికి సెల్ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతించరు.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బోధన్, నిజామాబాద్అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈనెల 13న పోలింగ్ జరగగా.. ఈవీఎంలను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఓట్లను లెక్కించేందుకు ఏడు హాల్స్ ఏర్పాటు చేశారు. పోలింగ్కేంద్రాలు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్, రూరల్ సెగ్మెంట్కు సంబంధించి 20,
మిగిలిన 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు 18 టేబుల్స్పై ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 130 టేబుళ్లు, పోస్టల్, సర్వీస్ ఓట్ల కోసం మరో 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో15 రౌండ్లు, బాల్కొండ, బోధన్ 14 రౌండ్లు, ఆర్మూర్ కౌంటింగ్ 13 రౌండ్లలో ముగుస్తుంది.