బయో ఏషియా సదస్సులో 80 స్టార్టప్​లు.. 70 కంపెనీలు

బయో ఏషియా సదస్సులో 80 స్టార్టప్​లు.. 70 కంపెనీలు
  • బయో ఏషియాలో ఉత్పత్తులను ప్రదర్శించిన సంస్థలు 
  • రాష్ట్ర సర్కారుతో అంతర్జాతీయ కంపెనీల ఒప్పందం
  • గ్రీన్​ ఫార్మా సిటీలో  5,445 కోట్ల పెట్టుబడులకు మరో11 సంస్థల ఎంవోయూ
  • ఒప్పందాలతో 22,300 మందికి ఉపాధి అవకాశాలు

హైదరాబాద్, వెలుగు: కొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చిన స్టార్టప్​లకు బయో ఏషియా సదస్సు వేదికగా నిలిచింది. మంగళవారం 80 స్టార్టప్​లు ఈ సదస్సులో తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. వాటితో పాటు 70కిపైగా సంస్థలు తమ వ్యాపార విస్తరణపై స్టాల్స్​ పెట్టాయి. ఆస్ట్రేలియా క్వీన్స్​లాండ్​ స్టేట్​ కూడా పెట్టుబడులకు సంబంధించి స్టాల్​ను ఏర్పాటు చేయగా.. కర్నాటక, గుజరాత్​ వంటి రాష్ట్రాలూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించాయి. ఎంఎస్ఎంఈ  కింద ఏర్పాటైన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకున్నాయి. కాగా, ఈ సదస్సు వేదికగా తెలంగాణ రాష్ట్రంతో పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికాలోని లాస్​ఏంజెలెస్​కు చెందిన ఎజిలీసియం.. హైదరాబాద్​లోని ఆర్​ఎంజెడ్​ స్పైర్​లో కొత్త ఆఫీసు ఏర్పాటు కోసం ఒప్పందం చేసుకుంది. అలాగే.. ఏఎల్ఎస్​ అనే కంపెనీ ఔషధాల టెస్టింగ్, ఇన్​స్పెక్షన్, సర్టిఫికేషన్, వెరిఫికేషన్​ సొల్యూషన్స్​కు సంబంధించి జీనోమ్​ వ్యాలీలో బయో ఫార్మా సీజీఎంపీ టెస్టింగ్​ ల్యాబ్​ను ఏర్పాటు చేయనుంది. 

మైషి ఫార్మా హైదరాబాద్​లో రెండో ఆర్​అండ్​డీ సెంటర్​ను ఏర్పాటు చేయనుంది. గ్రాన్యూల్స్, ఆర్బిక్యులర్, ఐజంట్, బయోలాజికల్​ ఈ, విర్కో, విరూపాక్ష, జుబిలెంట్, విమ్టా, అరాజెన్, భారత్​ బయోటెక్, సాయి లైఫ్​సైన్సెస్​ వంటి సంస్థలు.. గ్రీన్​ ఫార్మా సిటీలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో  రూ.5,445 కోట్ల పెట్టుబడులతో పాటు 9,800 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ 11 సంస్థలతో పాటు ఇంతకుముందు ఏర్పాటైన ఆరు సంస్థలు కలిపి మొత్తంగా గ్రీన్​ ఫార్మా సిటీలో రూ.11,100 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి సమకూరినట్లయింది. 22,300 మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. మరోవైపు అధునాతన పరిశోధన వసతులు, డిజిటల్​ హెల్త్​కేర్, ఏఐ ఇన్నొవేషన్స్​కు సంబంధించి తెలంగాణతో యూనివర్సిటీ ఆఫ్​ క్వీన్స్​లాండ్​ కీలక ఒప్పందం చేసుకున్నది. 

ఇన్నొవేటివ్​ ఫార్మాస్యూటికల్​ సర్వీసెస్​ ఆర్గనైజేషన్​ను ప్రారంభించిన రేవంత్​

రాష్ట్రంలో ఇన్నొవేటివ్ ​ ఫార్మాస్యూటికల్​ సర్వీసెస్​ ఆర్గనైజేషన్​ (ఐపీఎస్​వో) ను బయోఏషియా వేదికపై సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. పరిశ్రమల అవసరాలను తీర్చేలా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు 11 సంస్థలు సంయుక్తంగా ఈ ఆర్గనైజేషన్​ను ఏర్పాటు చేశాయి. స్టార్టప్​లను ప్రోత్సహించేందుకు టీహబ్​తో మాంచెస్టర్​కు చెందిన ఐ హెల్త్​ ఇన్నొవేషన్​ కీలక ఒప్పందం చేసుకున్నది. హెల్త్​కేర్​, మెడ్​టెక్, డయాగ్నస్టిక్స్,  డిజిటల్​ హెల్త్​ సొల్యూషన్స్​లో స్టార్టప్​లను ప్రోత్సహించనున్నారు. కాగా, ఏషియన్​ ఇన్ స్టిట్యూట్​ ఆఫ్​ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్​ నాగేశ్వర్​రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్​ ఏఎస్  సోమ్​నాథ్​ సహా పలు సంస్థలకు చెందిన చైర్మన్లు, సీఈవోలు పానెల్​ డిస్కషన్​లో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.