శ్రీనగర్‌‌లో చిక్కుకున్న మనోళ్లు...టూర్‌‌కు వెళ్లిన 81 మంది తెలంగాణ వాసులు

శ్రీనగర్‌‌లో చిక్కుకున్న మనోళ్లు...టూర్‌‌కు వెళ్లిన 81 మంది తెలంగాణ వాసులు
  • కుటుంబ సభ్యులతో వెళ్లిన కపిల్ చిట్‌ఫండ్ కంపెనీ మేనేజర్లు, ఏజెంట్లు 
  • టూర్‌‌లో భాగంగా పహల్గాం వెళ్లాలని ప్లాన్.. అంతలోనే అక్కడ ఉగ్రదాడి 
  • ప్రస్తుతం శ్రీనగర్‌‌లోని హోటల్‌లో బస.. అక్కడ అంతటా కర్ఫ్యూ

మెదక్, వెలుగు: శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు చెందిన 81 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్, వరంగల్, మెదక్ జిల్లాలకు చెందిన కపిల్ చిట్​ఫండ్​కంపెనీ ఆఫీస్ మేనేజర్లు, ఏజెంట్లు కుటుంబ సమేతంగా జమ్మూకాశ్మీర్ టూర్ వెళ్లారు. వారిలో మెదక్ కపిల్ చిట్స్ ఆఫీస్ మేనేజర్ పవన్, చైతన్య దంపతులు, ఏజెంట్ రామకృష్ణ , మహేశ్వరీ దంపతులు, వారి కొడుకు సుశాంత్​ఉన్నారు. వీళ్లంతా ఈ నెల 22న (మంగళవారం) హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌‌‌‌లో వయా ఢిల్లీ మీదుగా శ్రీనగర్​వెళ్లారు.

 ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు  శ్రీనగర్ చేరుకున్నారు.  అక్కడ హోటల్‌‌‌‌కు చేరుకుని ఫ్రెషప్​అయ్యాక స్థానికంగా ఉన్న తులిప్ గార్డెన్‌‌‌‌కు వెళ్లారు. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పహల్గాంకు గురువారం వెళ్లాలని ప్లాన్​చేసుకున్నారు. అయితే మంగళవారం అక్కడ పర్యాటకుల మీద ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని కాల్చి చంపారు. దాంతో తెలంగాణ టూరిస్టులంతా హోటల్‌‌‌‌లోనే ఉండిపోయారు. ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ ప్రాంతం ఆర్మీ కంట్రోల్ ఉందని, అంతటా కర్ఫ్యూ వాతావరణం నెలకొందని అక్కడున్న వారు తెలిపారు. ఫ్లైట్ దొరికితే హైదరాబాద్ తిరిగి వస్తామని చెప్పారు. 

సురక్షితంగా రప్పించేందుకు చర్యలు: మైనంపల్లి 

తెలంగాణకు చెందిన 81 మంది శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న విషయం తెలుసుకుని కాంగ్రెస్​నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పందించారు. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ హోటల్‌‌‌‌లో ఉన్న మెదక్‌‌‌‌కు చెందిన పొగాకు రామకృష్ణతో ఫోన్‌‌‌‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. శ్రీనగర్​డీజీపీ నళిని ప్రభాత్‌‌‌‌తో మాట్లాడానని, తెలంగాణకు చెందిన వారిని సురక్షితంగా హైదరాబాద్‌‌‌‌కు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని  కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని హన్మంతరావు తెలిపారు.