డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్ పేరుతో 1.38 కోట్లు టోకర.. వృద్ధుడిని బెదిరించి కాజేసిన సైబర్ నేరగాళ్లు

డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్ పేరుతో 1.38 కోట్లు టోకర..  వృద్ధుడిని బెదిరించి కాజేసిన సైబర్ నేరగాళ్లు
  • ఇద్దరిని అరెస్ట్​ చేసిన సైబర్​ క్రైమ్​ పోలీసులు
  • ఓ రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగికి  కూడా రూ.28 లక్షలు టోకరా

గచ్చిబౌలి, వెలుగు: డిజిటల్​అరెస్ట్​ పేరిట సైబర్ నేరగాళ్లు 82 ఏండ్ల వృద్ధుడి(రిటైర్డ్​ ఇంజినీర్)​ బ్యాంక్​అకౌంట్ నుంచి రూ.1.38 కోట్లు కాజేశారు. ఈ కేసులో సైబరాబాద్​సైబర్ క్రైమ్​పోలీసులు ఇద్దరిని అరెస్ట్​ చేశారు. హైదరాబాద్ కు చెందిన వృద్ధుడికి..ఓ వ్యక్తి కాల్​చేసి తాను ఎస్సీఐ ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్నాడు. మీ బ్యాంక్​అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్​జరిగిందని, మీపై కేసు నమోదయ్యిందని వృద్ధుడిని బెదిరించాడు. ముంబై సైబర్​క్రైమ్​ అఫీసర్​మాట్లాడుతాడంటూ వాట్సప్​ కాల్​తో మరో వ్యక్తి కూడా  వృద్ధుడితో మాట్లాడాడు.

మనీ లాండరింగ్​జరిగినందునా ..అధార్​ వివరాలు ఇవ్వాలని, బ్యాంక్​ అకౌంట్లను చెక్​ చేస్తామని చెప్పాడు. భయపడిపోయిన వృద్ధుడు తన అధార్​ కార్డు వివరాలను వారికి చెప్పాడు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు వృద్ధుడి బ్యాంక్​అకౌంట్ల నుంచి రూ.1.38 కోట్లు ట్రాన్స్​ఫర్​చేసుకున్నారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ఆధారంగా తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన శంకర్​ గణేశ్(46), అతని సహచరుడు ఎలంచెజియన్​ సత్యవేల్​లను అరెస్ట్​ చేశారు. సచిన్​, జెస్మిన్​ మోండల్, ముత్తుకుమార్, సలీమ్​లు అఫీసర్లుగా నటిస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్ల రూపాయలు కొట్టేసి తమ అకౌంట్లకు ట్రాన్స్​ఫర్​ చేసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

మరో కేసులో..

 డిజిటల్​అరెస్ట్​ పేరిట రిటైర్డ్​ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 28.68 లక్షలు కొట్టేసిన ఆరుగురిని సైబరాబాద్​సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్​ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. సైబరాబాద్​కు చెందిన రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగి(66)కి ముంబై పోలీస్​ఆఫీసర్ ని​అంటూ ఓ వ్యక్తి కాల్​చేశాడు. అధార్​ కార్డుతో ముంబైలో బ్యాంక్​అకౌంట్​ఓపెన్​చేశారని, మీ బ్యాంక్​అకౌంట్ ద్వారా మనీ లాండరింగ్​జరిగిందని పేర్కొన్నాడు. విచారణకు సహకరించకపోతే 3 నుంచి 7 ఏండ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించాడు.

భయపోడిపోయిన సదరు రిటైర్డ్​ఉద్యోగి.. వారు సూచించిన విధంగా పలు బ్యాంక్​అకౌంట్లకు రూ.28.68 లక్షలు ట్రాన్స్​ఫర్​చేశారు. తిరిగి డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి రిటైర్డ్​ ఉద్యోగి సైబరాబాద్​సైబర్ క్రైమ్​పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ఆధారంగా పోలీసులు..ముస్తాఫా, హెన్సిలీ జోసెఫ్​, మణికందన్, హంజా, ఆషిఫ్​అలీలను అరెస్ట్​ చేశారు. ప్రధాన నిందితుడు బాబు పరారీలో ఉన్నాడు.

వాట్సాప్​లో ఏపీకే ఫైల్ పంపించి రూ.7.44 లక్షలు

బషీర్​బాగ్: ఏపీకే ఫైల్ పంపించి, ఓ మహిళ బ్యాంక్ ఖాతాను సైబర్ చీటర్స్ ఖాళీ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 34 ఏళ్ల మహిళ హెల్త్ సెక్టార్ లో ఉద్యోగం చేస్తున్నది. ఐదు రోజుల క్రితం మహిళకు ఇండస్ ఇండ్ బ్యాంక్ ఆన్​లైన్ ప్రాసెస్ నుంచి వాట్సాప్ ద్వారా ఓ ఏపీకే ఫైల్ వచ్చింది.

బాధిత మహిళ అకౌంట్ అదే బ్యాంక్ లో ఉండడం వల్ల ఆ లింక్ ను ఓపెన్ చేసింది. అందులో మహిళకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలని ఉండడంతో, అనుమానం వచ్చి క్లోస్ చేసింది. మరుసటి రోజు ఆమె మొబైల్ కు అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినట్లు పలు మెసేజ్ లు వచ్చాయి.

దీంతో బాధితురాలు వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చి  అకౌంట్ ను బ్లాక్ చేసింది. అప్పటికే అకౌంట్ లోని మొత్తం రూ. 7,44,999 ఖాళీ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.