
పూర్వకాలంలో మానవులు తమ అవసరాల కోసం వస్తుమార్పిడి చేసుకునేవారు. ఈ క్రమంలో 244 సంవత్సరాల క్రితం మన దేశంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకుగా 1770లో కలకత్తాలో ‘బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్’ బ్యాంకును అలెగ్జాండర్ & కంపెనీ, ఇంగ్లిష్ ఏజెన్సీ హౌస్ వారితో స్థాపించారు. కానీ, 1782లో దాన్ని 12 సంవత్సరాలకే మూసివేశారు. ఆ తర్వాత 1806 జూన్ 2న బ్యాంక్ ఆఫ్ బెంగాల్ (కలకత్తా) స్థాపించారు. రెండో బ్యాంకును 1840లో బ్యాంక్ ఆఫ్ బొంబాయి, మూడో బ్యాంక్ 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ను ఏర్పాటు చేశారు.
యూరోపియన్ల సహకారంతో భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ బ్యాంకు ‘అలహాబాద్ బ్యాంకు’ను 1865లో కలకత్తాలో స్థాపించారు. ఈ బ్యాంకులలో మన భారతీయులతో వెట్టి చాకిరీ చేయించుకున్నారు. శ్రమదోపిడీ జరిగింది. ఆనాడే దానిని గ్రహించి బ్యాంకులలో పనిచేస్తున్న భారతీయులందరూ సంఘటితమయ్యారు. దానిని పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం.. పూర్తిగా భారతీయ యాజమాన్యంతో ఏర్పడిన తొలి వాణిజ్య బ్యాంకు ‘అవద్ బ్యాంకు’ను 1881లో ఆగ్రాలో ఏర్పాటు చేశారు. ఈ బ్యాంక్ను 1958లో మూసివేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రారంభం
మన మొదటి భారతీయుల బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను 1894 ఏప్రిల్ 12న లాహోర్ లో లాలా లజపతిరాయ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ బ్యాంకును మళ్లీ చండీగడ్కు మార్చారు. 1901లో పీపుల్స్ బ్యాంకును స్థాపించారు. 1905లో స్వదేశీ ఉద్యమం (వందేమాతరం ఉద్యమం) కారణంగా అనేక నూతన బ్యాంకులు స్థాపించడం జరిగింది. ఈక్రమంలో 1906లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1907లో ఇండియన్ బ్యాంకు, 1909లో బ్యాంక్ ఆఫ్ బరోడా, 1911లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను స్థాపించారు.
1914 జులై 28 నుంచి1918 నవంబర్ 11 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, 1919 ఏప్రిల్ 13న జలియన్వాలాబాగ్ సంఘటన, 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, 1921లో సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సాధించుకునే దిశగా అనేక పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాల ద్వారా మన దేశంలో కోటి 50 లక్షల మంది చనిపోయారు. దీని కారణంగా రూపాయి విలువ పడిపోయింది. పేదవాడికి అన్నం దొరక లేదు. ఈ దేశమే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ఈ నష్టాన్ని పూరించడానికి గతంలో ఉన్న బ్యాంకులన్నిటినీ కలిపి బ్రిటిష్ ప్రభుత్వం 1921 జనవరి 27న ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేసింది.
ఎస్బీఐగా ఇంపీరియల్ బ్యాంక్
గోర్వాలా కమిటీ సూచన మేరకు 1955 జులై 1న ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)గా మార్చారు. ఈ దేశాన్ని భారత రాజ్యాంగం ఎలా నడిపిస్తుందో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులను ఆర్బీఐ నడుపుతోంది. బ్యాంకులన్నిటికీ సుప్రీం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ ఎలా ఏర్పడిందో 1934 చట్టం ఆర్బీఐ పీఠికలో.. ఆర్బీఐ లోగో, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఫొటో, విషయం సూచికలో పొందుపరచడం జరిగింది. ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత బీఆర్ అంబేద్కర్. అయితే, ఆ మహనీయుని చరిత్రను చెప్పడంలో భారత ప్రభుత్వం, ఆర్బీఐ విఫలమయ్యాయి.
కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి
ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత బీఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని కోరుతూ అంబేద్కర్ ఫొటో సాధన సమితి ఏర్పాటైంది. ఆర్బీఐ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని, కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని, కేంద్రాన్ని డిమాండ్ చేయడం జరిగింది. 2025 ఏప్రిల్ 1నాటికి ఆర్బీఐ ఏర్పడి 90 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నోట్లపై అంబేద్కర్ ఫొటోకు ఆర్బీఐ ఆమోదం తెలిపి.. చరిత్రను పౌర సమాజానికి తెలియజేయాలి.
1935లో రిజర్వ్బ్యాంక్ ఏర్పాటు
ఇంపీరియల్ బ్యాంకు విధులు నిర్వహించడంలో విఫలమైంది. అప్పుడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సగటు వ్యక్తి కోణంలో నుంచి ఆర్థికకోణాన్ని దృష్టిలో ఉంచుకొని ‘రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం’ ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర పుస్తకాన్ని రాసి 1923లో హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్ కు ఇవ్వడం జరిగింది. వాస్తవాన్ని గ్రహించి 1934 చట్టం సెంట్రల్ లెజిస్లేటివ్ ఆమోదించింది.
1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అమల్లోకి వచ్చింది. అదేవిధంగా 1949 జనవరి 1న బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం బ్యాంకులను జాతీయ చేయడం, భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు సింహాల బొమ్మను రాజముద్రగా పెట్టాలని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ చెప్పడం వల్ల కరెన్సీ నోట్లపై రాజముద్ర వేశారు.
డా. జేరిపోతుల పరశురామ్