
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందిన ఐపీఎల్ను మరింత విస్తరించాలని బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. 2028లో ప్రారంభమయ్యే మీడియా హక్కుల నుంచి ఐపీఎల్ మ్యాచ్లను 94కు పెంచే చాన్స్ ఉందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ హింట్ ఇచ్చారు. అయితే కొత్తగా ఫ్రాంచైజీలు తెచ్చే చాన్స్ అయితే లేదని స్పష్టం చేశారు. హోమ్ అండ్ అవే ఫార్మాట్ను పూర్తి స్థాయిలో విస్తరించి మ్యాచ్ల సంఖ్యను పెంచనున్నారు.
2022లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్జెయింట్స్ రాకతో మ్యాచ్ల సంఖ్య 74కు పెరిగింది. 2025 నుంచి దాన్ని 84కు పెంచాలని ప్లాన్స్ చేసినా, బిజీ షెడ్యూల్, డబుల్ హెడర్ మ్యాచ్లపై బ్రాడ్కాస్టర్స్ పెద్దగా ఆసక్తిచూపకపోవడంతో అది సాధ్యపడలేదు. రాబోయే రెండేళ్ల ఎఫ్టీపీ కూడా ఇప్పటికే ఖరాదైంది.. దీంతో 2028లో ప్రారంభమయ్యే మీడియా రైట్స్ను దృష్టిలో పెట్టుకుని హోమ్ అండ్ అవే ఫార్మాట్ను పూర్తి స్థాయిలో విస్తరించాలని బీసీసీఐ యోచిస్తోంది.
‘కచ్చితంగా దీన్ని ఓ అవకాశంగా భావిస్తాం. ఈ అంశంపై ఐసీసీతో చర్చిస్తున్నాం. బీసీసీఐతో అంతర్గతంగా చర్చలు చేస్తున్నాం. మేం ఓ పెద్ద విండోను కోరుకుంటున్నాం. దాని ద్వారా మ్యాచ్ల సంఖ్యను 84, 94కు పెంచుకోవచ్చు. ద్వైపాక్షిక క్రికెట్, ఐసీసీ ఈవెంట్లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని ధుమాల్ వ్యాఖ్యానించారు.