- ఇంజినీరింగ్లో 98 వేల సీట్లు
- నేటి నుంచి ఎప్సెట్ వెబ్ ఆప్షన్లు
- కన్వీనర్ కోటాలో 70,307 సీట్లు అందుబాటులోకి
- కొత్త సీట్లు, కన్వర్షన్పై ఇంకా నో క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఇవ్వాల్టి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ సీట్ల వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. రాష్ట్రంలో 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 98,296 సీట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీంట్లో 70,307 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. 152 ప్రైవేటు కాలేజీల్లో 91,143 సీట్లు ఉండగా, వాటిలో కన్వీనర్ కోటాలో 63,704 సీట్లు నింపుతారు.
వర్సిటీ క్యాంపస్, సర్కారు కాలేజీలు 19 ఉండగా, వాటిలో 5343 సీట్లు ఉన్నాయి. మరో రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,260 సీట్లు ఉన్నాయని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. కాగా, ఓయూ పరిధిలోని రెండు సర్కారు కాలేజీల్లో 630, జేఎన్టీయూహెచ్ పరిధిలో 9 కాలేజీలు ఉండగా.. వాటిలో 3,150 సీట్లు, కేయూ పరిధిలో మూడు కాలేజీల్లో 1080 సీట్లు ఉన్నాయి. అయితే, బీటెక్ ఫస్టియర్లో మొత్తం 45 బ్రాంచుల్లో సీట్లు భర్తీ చేస్తున్నారు.
దీంట్లో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) లో 21,599 సీట్లు ఉండగా.. సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) లో 11,196, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) లో 10,398, సీఎస్ఈ డేటా సైన్స్ లో 6,516, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లో 1,365, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో1,418, ఈఈఈలో 4,202, ఐటీలో3,705, సివిల్ ఇంజినీరింగ్ లో 3,231, మెకానికల్ ఇంజినీరింగ్ లో 2,979 సీట్లు ఉన్నాయి.
నేటి నుంచి వెబ్ ఆప్షన్లు..
ఎప్ సెట్ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. ఆదివారం రాత్రి వరకూ 91,530 మంది రిజిస్ర్టేషన్ చేసుకొని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 25,041 మందికి వెరిఫికేషన్ పూర్తయింది. ఈ ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. ఈనెల 13 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు అవకాశం ఉండగా.. 15 వరకూ వెబ్ ఆప్షన్లకు చాన్స్ ఉంది.
కొత్త సీట్లు పెండింగ్
ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు కాలేజీలు కొత్త సీట్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నింటినీ సర్కారు పెండింగ్లో పెట్టింది. ఇప్పటికే 20 వేలకు పైగా సీట్లకు ఏఐసీటీఈ పర్మిషన్ ఇచ్చింది. ఇంకో 9 వేల సీట్ల కన్వర్షన్కు మేనేజ్మెంట్లు సర్కారుకు అప్లై చేసుకున్నాయి. అయితే, కొత్త సీట్లపై సర్కారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండో విడత కౌన్సెలింగ్ నాటికి వాటిపై నిర్ణయం తీసుకుంది. అయితే, ఫీజుల భారం సర్కారుపై పడకుండా.. సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.