
- ఏడుగురి అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, పరారీలో ముగ్గురు
- వివరాలు వెల్లడించిన
- ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డి, వెలుగు : హైవే పక్కన కొందరు డేరాలు వేసుకుని పొద్దంతా చిరు వ్యాపారాలు చేస్తూ రాత్రి వేళల్లో దోపిడీలకు ప్రాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశామని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు ఆఫీసులో ఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. మహారాష్ర్ట స్టేట్లోని వార్ధ జిల్లాకు చెందిన 10 మంది ఇక్కడకు వచ్చారన్నారు. హైవే పక్కన డేరాలు వేసుకొని పొద్దంతా బెలూన్లు, ఇతర చిన్న పాటి వస్తువులు అమ్ముతున్నారన్నారు.
రాత్రి వేళల్లో హైవేపై వెహికల్స్పై దాడి చేసి చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవల జిల్లాలోని దేవునిపల్లి, సదాశివనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో హైవేలపై దోపిడీలు జరిగాయని పేర్కొన్నారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో 4 స్పెషల్ టీమ్స్ దర్యాప్తు చేపట్టగా అంతర్రాష్ట్ర ముఠా చిక్కిందన్నారు. కులి కిషన్ పవర్, జాకీ గుజ్జు బోష్లే, పవర్ హరీశ్, అనురాగ్ రత్నప్పబోస్లే, అన్చన, హవర్ పవర్, చూడీలను అరెస్టు చేసినట్లు వివరించారు. మరో ముగ్గురు దొంగలు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
ఈ ముఠా దేవునిపల్లి, సదాశివనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనే కాకుండా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, డిచ్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా నేరాలు చేశారన్నారు. ముఠా సభ్యుల నుంచి సెల్ఫోన్లు 2, ల్యాప్ట్యాప్ బ్యాగ్ 1, కత్తులు 4, కర్రలు 2, రాళ్లు, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠా సభ్యులను పట్టుకొవటంతో సీసీఎస్ సీఐ శ్రీనివాస్, రూరల్, సదాశివనగర్ సీఐలు రామన్, సంతోష్, ఎస్సైలు రాజు, రంజిత్, సిబ్బంది బాగా పని చేశారని ఎస్పీ అభినందించారు.