
వికారాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏడేండ్ల బాలుడు బలయ్యాడు. వికారాబాద్జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని టాకీ తండాకు చెందిన రాథోడ్ వెంకటేష్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని షోషిస్తున్నాడు. ఆయన కొడుకు శ్రీరామ్ (7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు.
బుధవారం పాఠశాలలో ఆడుకుంటూ రోడ్డు దాటుతుండగా, తాండూర్ నుంచి క్యాద్గిరా వెళ్తున్న ఆర్టీసీ (అద్దె) బస్సు బాలుడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు టైర్ కిందపడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడిపి తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడని, తమకు న్యాయం చేయాలని బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బస్సు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.