![‘ప్లూటో’ లోయకు ఇండియన్ పేరు](https://static.v6velugu.com/uploads/2019/08/Indian-name.jpg)
సౌర వ్యవస్థలో మరుగుజ్జు గ్రహం ప్లూటో. దాన్నే తెలుగులో యమ/వరుణ గ్రహం అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఆ గ్రహానికి నేరుగా భూమిపై ఉన్న ఇండియాతో ఓ లింక్ ఉండబోతోంది. ఆ గ్రహంపైన ఉన్న ఓ లోయకు మన సైంటిస్టు పేరు పెట్టింది ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ (ఐఏయూ). గత నెలలో ప్లూటో లోయలకు రెండో సెట్ పేర్లను పెట్టింది. 2015లో న్యూ హొరైజాన్స్ స్పేస్క్రాఫ్ట్తో నాసా ప్లూటో మిషన్ను చేపట్టింది. అక్కడ కనుగొన్న లోయలకు నాసా టీం 14 పేర్లను సూచించింది. అందులో బిషున్ ఖారే పేరునూ ప్రతిపాదించింది. గత నెలలోనే ఖారే సహా ఆ 14 పేర్లను ఐఏయూ ఖరారు చేసింది. 1933 జూన్ 27న వారణాసిలో పుట్టిన ఖారే, బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్లలో డిగ్రీలు చశారు. తర్వాత న్యూయార్క్లోని సైరాక్యూజ్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. స్టోనీ బ్రూక్లోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. 1960 నుంచి 1990 వరకు కార్నెల్ యూనివర్సిటీలో పనిచేశారు. ఫిజిక్స్లో 100 రీసెర్చ్ పేపర్లు రాశారు. తర్వాత 1996లో నాసా ఏమ్స్లో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరారు. 1998లో సెటీ ఇనిస్టిట్యూట్లో సైంటిస్టుగా పనిచేశారు. 2013 ఆగస్టులో 80 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. ఆయన సైంటిస్టుగా ఉన్న సమయంలో శని చందమామలైన టైటాన్, ఎన్సిలాడస్లపై ఏర్పడిన మీథేన్, ఇతర ఆర్గానిక్ మూలకాలు, వాటి మబ్బులపై పరిశోధన చేశారు. అంతేగాకుండా ప్లూటోపై ఎరుపు రంగు రావడానికి కారణం థోలిన్స్ అనే కర్బన అణువేనని ఆయన కనిపెట్టారు. అందుకు గుర్తుగానే ప్లూటో లోయకు బిషున్ ఖారే పేరు పెడుతున్నామని ఐఏయూ ప్రకటించింది. అంతకుముందు రెండేళ్ల క్రితం ప్లూటోపై రెండు కొండలకు మొదటి సెట్ పేర్లను ఐఏయూ పెట్టింది.