మెదక్లో ఘోర ప్రమాదం.. కారు వాగులో పడి ఏడుగురు మృతి

మెదక్లో ఘోర ప్రమాదం.. కారు వాగులో పడి ఏడుగురు మృతి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరిక పల్లి గ్రామ శివారులో 2024, అక్టోబర్ 16వ తేదీ బుధవారం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన బెలోనా కారు అదుపు తప్పి వాగులో పడిపోయింది. శివంపేట నుంచి భీమ్లా తండాకు వెళ్తున్న కారు.. మొదటగా చెట్టును ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న వాగులోకి వేగంగా దూసుకెళ్లింది. 

ఈ యాక్సిడెంట్ లో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అప్పటికే ఏడుగురు చనిపోయారు. వీళ్లందరూ ఒకే కుటుంబానికి చెందిన బంధువులు. మృతులు తాళ్లపల్లి తండాకు చెందిన భార్యాభర్తలు శివరాం, దుర్గమ్మ, భీమ్లా తాండకు చెందిన తల్లికూతుళ్లు శాంతి, అమ్మూ, జెగ్యతండాకు చెందిన తల్లి అనిత, కూతుళ్లు ఇందు, శ్రావణి లుగా పోలీసులు గుర్తించారు.


ALSO READ | గచ్చిబౌలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అత్యాచారం కేసులో ఒకరు అరెస్ట్