
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ వినియోగదారుడికి ఓ గ్యాస్ ఏజెన్సీ రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఫోరం బెంజ్ తీర్పు వెలువరించింది. గ్యాస్ సిలిండర్ డెలివరీకి రూ.30 అదనంగా అడగటం సేవా లోపమని దాఖలైన ఫిర్యాదులో వినియోగదారుడికి గ్యాస్ ఏజెన్సీ పరిహారంగా చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు ఎం.శ్రీలత తీర్పునిచ్చారు. గుత్తిరోడ్డులోని హనుమాన్ ఏజెన్సీలో హెచ్పీ గ్యాస్ కనెక్షన్ ఉంది. వినియోగదారుడు 2019 అక్టోబరు 7న రీఫిల్ సిలిండర్ బుక్ చేసుకున్నారు. ఇంటికీ తీసుకువచ్చినందుకు అదనంగా రూ.30 ఇవ్వాలని డెలివరీ బాయ్ డిమాండ్ చేశాడు. ఎందుకు ఇవ్వాలని వినియోగదారులు డెలివరీ బాయ్ ను అడిగాడు. అదనంగా డబ్బులు ఇవ్వనందుకు అతను సిలిండర్ను వెనక్కి తీసుకెళ్లాడు. దీనిపై వినియోగదారుడు పౌర సరఫరాల అధికారికి తెలియజేయడంతో తిరిగి సిలిండర్ను ఇంటిముందు ఉంచి వెళ్లిపోయారు.
ఈ విషయంపై సదరు ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్తే.. సరఫరా ఖర్చులు ఉంటాయని, వాటిని అడుగుతుంటారని సమర్థించారు. మరుసటి నెల వినియోగదారుడిని మరో ఏజెన్సీకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఏజెన్సీని మార్చడంపై కలెక్టర్కు ఓ కార్యక్రమంలో ఫిర్యాదుచేశారు. అనంతరం జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి సిలిండర్ లేకపోవడంతో పడిన ఇబ్బందులను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోరం గ్యాస్ ఏజెన్సీకి, ఏపీ పౌర సరఫరాల సంస్థకు నోటీసులు జారీచేసి, విచారణ చేపట్టింది. డెలివరీ బాయ్ను తొలగించినందున పరిహారం చెల్లించాల్సిన పని లేదని ఏజెన్సీ వాదనలు వినిపించింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. ఏజెన్సీ రూ.లక్ష పరిహారంగా చెల్లించాలని ఫోరం బెంచ్ తీర్పు వెలువరించింది.