- బఠిండాలో మళ్లీ కలకలం.. బుల్లెట్ గాయంతో మరో జవాన్ మృతి
- బఠిండాలో ఏం జరిగింది..?
- మరో జవాన్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
చండీగఢ్ : పంజాబ్ లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో కాల్పులు జరిగిన కొద్ది గంటల్లోనే చోటు చేసుకొన్న మరో ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం (ఏప్రిల్ 12న) సాయంత్రం ఓ జవాను బుల్లెట్ గాయంతో మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
అయితే.. ఈ జవాను ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా..? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో అతడు మరణించి ఉంటాడని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. మృతుడిని లఘు రాజ్ శంకర్గా గుర్తించారు.
బఠిండా సైనిక స్థావరంలో బుధవారం (ఏప్రిల్ 12న) తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆగంతకులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దం వినిపించగానే క్విక్ రియాక్షన్ బృందాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. ఘటన జరిగిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కుర్తా పైజామా ధరించి, ముఖానికి మాస్కులతో వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.