
- తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో కండిషన్ సీరియస్
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనుడు
- డబ్బులు, పొలం కూడా ఇవ్వకుండా మోసం
- మహబూబాబాద్ జిల్లా రాజోలులో ఘటన
- ఫిర్యాదు చేసిన కూతురు
మహబూబాబాద్/కురవి, వెలుగు: పొలం కొనిస్తాం.. డబ్బులు కూడా ఇస్తామంటూ ఆశచూపి ఓ గిరిజనుడి నుంచి కిడ్నీ తీసుకున్నారు. అనంతరం అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు, పొలం ఇవ్వకపోగా, సరైన ట్రీట్మెంట్ కూడా ఇప్పించకపోవడంతో బాధితుడు అనారోగ్యానికి గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
కురవి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజోలు గ్రామ శివారు పోలేంపల్లి తండాకు చెందిన ధరావత్ చిట్టిబాబుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఏడాదిన్నర కింద అదే తండాకు చెందిన ఓ వ్యక్తి చిట్టిబాబు వద్దకు వచ్చి తనకు తెలిసిన వ్యక్తికి కిడ్నీని ఇస్తే రెండెకరాల పొలం, రూ.ఐదు లక్షలు ఇప్పిస్తానని చెప్పాడు. ఇందుకు ఒప్పుకున్న చిట్టిబాబు.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లి కిడ్నీ ఇచ్చాడు. అయితే కిడ్నీ తీసుకున్న వారు చిట్టిబాబుకు సరైన వైద్యం ఇప్పించకపోవడంతో ఇటీవల అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో అతడి కుమార్తె రమాదేవి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లింది. పరీక్షించిన డాక్టర్లు చిట్టిబాబుకు ఒక కిడ్నీ లేదని, మిగిలిన ఒక్క కిడ్నీలో సమస్య ఏర్పడడంతో ఆయన అనారోగ్యానికి గురైనట్టు తెలిపారు. చిట్టిబాబు ఆరోగ్యం మరింత క్షీణించడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లి.. ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం సీరియస్గానే ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు..
తండ్రి కిడ్నీ దానం చేసిన విషయం తనకు తెలియదని, తమకు కావాల్సిన వాళ్లే డబ్బులు ఇప్పిస్తామని ఆశ చూపి మోసం చేశారంటూ చిట్టిబాబు కుమార్తె రమాదేవి శనివారం కురవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై సతీశ్ తెలిపారు. అయితే.. చిట్టిబాబు కిడ్నీ ఇచ్చిన టైంలో అగ్రిమెంట్ పేపర్స్పై అతడి కుమారులు నితిన్, రాం సైతం సంతకాలు చేసినట్టు తెలుస్తున్నది. కానీ చిట్టిబాబు హాస్పిటల్లో ఉన్నా, తమ సోదరి కేసు పెడుతున్నా.. ఆ ఇద్దరు జాడ లేకపోవడం గమనార్హం. చిట్టిబాబు ఇచ్చిన కిడ్నీని కురవి మండలం నల్లెల గ్రామానికి చెందిన మరో గిరిజనుడికి అమర్చినట్టు సమాచారం.