
- సీఎం సభకు వెళ్లే బస్సు ముందు బైఠాయింపు
- పక్కకు తప్పించి వెళ్లిపోయిన బీఆర్ఎస్ కార్యకర్తలు
- దవాఖానకు తరలించిన పోలీసులు
టేక్మాల్, వెలుగు : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాలోజిపల్లిలో తనకు దళితబంధు స్కీమ్ మంజూరు కాలేదని బేగరి దేవయ్య అనే యువకుడు పినాయిల్తాగి హల్చల్ చేశాడు. మెదక్లో బుధవారం జరిగిన సీఎం కేసీఆర్ మీటింగ్కు సాలోజిపల్లి నుంచి బస్సు బయలుదేరింది. అందులో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడంతో దాని ముందు కూర్చుని తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంతకుముందు గ్రామ సేవక్గా పని చేశానని, ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా లేదని తన పరిస్థితి అగమ్యగచరంగా మారిందనన్నాడు. కొద్దిసేపు చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలు తర్వాత అతడిని బస్సు ముందు నుంచి పక్కకు తప్పించి మీటింగ్కు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న టేక్మాల్ పోలీసులు అక్కడికి వచ్చి దేవయ్యను జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు.