-
స్నేహితుడి భార్య పై అత్యాచార యత్నం
-
బయటకు చెబుతుందేమోనని హత్య
షాద్ నగర్, వెలుగు: భర్త ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఉన్న భార్యపై అతని స్నేహితుడు అత్యాచారానికి యత్నించాడు. ఆ విషయం బయటకు చెబుతుందేమో అని గొంతు నులిపి హత్య చేశాడు. ఈ నెల 12న కొత్తూరులో ఈ ఘటన జరిగింది. సోమవారం కొత్తూరు పోలీసులు నిందితుడిని రిమాండ్కు పంపారు. శంషాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.
మండలంలోని ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన ఓ మహిళ (45) కొత్తూరులోని అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటుంది. ఆమె భర్త రామారావు, అతని స్నేహితుడు బాబురావు(60)అడ్డా కూలీలుగా పని చేసేవారు. రామారావు ఇటీవలే తన స్వగ్రామానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాబూరావు, రామారావు భార్యకు మద్యం తాగించి అత్యాచారానికి యత్నించాడు. ఆమె అడ్డుకుంది. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందోనని బాబూరావు ఆమెను చంపేశాడు.
మృతురాలి కూతురు ఫిర్యాదుతో కొత్తూరు సీఐ నరసింహరావు హత్య కేసు నమోదు చేశారు. సోమవారం బాబురావును రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో సీఐ నరసింహరావు, ఎస్సై జి.శ్రీనివాస్, కానిస్టేబుల్ రవీందర్, కుమార్, మహిపాల్ ఉన్నారు.