ఆస్పత్రిలో అన్న,తమ్ముడికి రాఖీ కట్టి.. ప్రాణాలు వదిలిన చెల్లెలు

ఆస్పత్రిలో అన్న,తమ్ముడికి రాఖీ కట్టి.. ప్రాణాలు వదిలిన చెల్లెలు

రాఖీ పండుగ అనగానే అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముడు గుర్తొస్తారు.  ఎన్ని గొడవలు పడ్డా..ఎక్కడున్నా ఆ రోజు సోదరులకు రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుతారు. కష్టాలు వచ్చినా..కన్నీళ్లు వచ్చినా ప్రాణాలున్నంత వరకు ఒకరినొకరు అండగా ఉంటామని చెప్పుకుంటారు.  అది రక్తసంబంధానికి ఉన్న విలువ. అయితే కాసేపట్లోనే చనిపోతానని  తెలిసిన ఓ సోదరి ఆస్పత్రిలోనే  తన సోదరులకు రాఖీ కట్టి  తుది శ్వాస విడిచింది.  ఈ   హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా  నర్సింహుల పేట మండలంలో జరిగింది. 

తాను బతుకుతానో లేదోనని   చివరి సారిగా తన అన్న,తమ్ముడికి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కొన్ని గంటల్లోనే తుది శ్వాస విడిచింది.  ఆస్పత్రి బెడ్ పై నుంచే రాఖీ కట్టిన ఈ వీడియో చూస్తే అందరినీ కలిచివేస్తోంది.  చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి.

అసలేం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన ఓ సోదరి  కోదాడలోని ఓ కళాశాలలో పాల్ టెక్నిక్ చదువుతోంది. ప్రేమ పేరుతో ఓ ఆకతాయి నిత్యం వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన బాలిక  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  గమనించిన బందువులు చికిత్స కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే రాఖీ పండుగ వరకు బతుకుతానో లేదోనని శనివారం(ఆగస్టు 17న) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక.. తన అన్నదమ్ముళ్లను పిలిచి బెడ్ పై నుంచే రాఖీ కట్టింది. తర్వాత కొన్ని గంటలకే  తుది శ్వాస విడిచింది.    నర్సింహుల పేట పోలీసులు ఆ ఆకతాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.