ఎలివేటెడ్​ కారిడార్​ ప్రాజెక్టులో ముందడుగు.. 4230 చెట్ల ట్రాన్స్​లోకేషన్

ఎలివేటెడ్​ కారిడార్​ ప్రాజెక్టులో ముందడుగు.. 4230 చెట్ల ట్రాన్స్​లోకేషన్
  • రెండు కారిడార్ల మధ్య తొలగించాల్సిన చెట్లను గుర్తించిన హెచ్ఎండీఏ  
  •  సంస్థల నుంచి టెండర్ల ఆహ్వానం  
  •  రూ.7.27 కోట్లు ఖర్చవుతుందని అంచనా

హైదరాబాద్​సిటీ, వెలుగు:
హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్​ కారిడార్​ ప్రాజెక్టులో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మించే ప్రాంతాల్లో రోడ్లకు రెండువైపులా భారీ సంఖ్యలో  చెట్లు అడ్డు వస్తుండడంతో, వాటిని ట్రాన్స్​లొకేట్​చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ పద్ధతిలో అవసరమైన చెట్లను, వృక్షాలను పెకిలించి వేరే ప్రాంతాలకు తీసుకువెళ్లి నాటుతారు. దీనికి సుమారు రూ. ఏడు కోట్లకుపైగా ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. 

ఎలివేటెడ్​కారిడార్​ ప్రాజెక్టులో భాగంగా ప్యారడైజ్​నుంచి బోయిన్​పల్లి డెయిరీఫామ్​రోడ్​ (5.32 కి.మీ.)వరకు డబుల్​ డెక్కర్​పద్ధతిలో ఒక ఫ్లై ఓవర్​, జేబీఎస్​నుంచి శామీర్​పేట (18.12 కి.మీ.) వరకు 3,812 కోట్లతో మరో ఫ్లై ఓవర్​నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఈ రూట్​లో అడ్డు వచ్చే చెట్లను నరికివేయకుండా ట్రాన్స్​లొకేట్​చేయాలని చేయబోతున్నారు. దీని కోసం తాజాగా టెండర్లు పిలిచినట్టు అధికారులు తెలిపారు. 

తొలగించాక..పెరిగేవరకూ వారిదే బాధ్యత

ఎలివేటెడ్​కారిడార్​కు అడ్డు వస్తున్న చెట్లపై హెచ్ఎండీఏలోని అర్బన్​ఫారెస్ట్రీ అధికారులు సర్వే చేశారు. ఇందులో జేబీఎస్​నుంచి శామీర్​పేట రూట్​లో  ఆల్వాల్, తూంకుంట  ప్రాంతాల్లో 3,272 చెట్లు, ప్యారడైజ్​నుంచి శామీర్​పేట దారిలో ఓఆర్ఆర్ వరకు...ఆల్వాల్, తూంకుంటలలో 395, ప్యారడైజ్​జంక్షన్​ నుంచి డెయిరీఫామ్​ రోడ్​లో వయా తాడ్​బండ్​, బోయిన్​పల్లి మధ్య 515 చెట్లు, డెయిరీఫామ్​వయా తాడ్​బండ్, బోయిన్​పల్లిలో 78 చెట్లు ఉన్నట్టు గుర్తించారు. రెండు కారిడార్లలో మొత్తం 4230 చెట్లను తొలగించేందుకు కొన్ని సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించారు. 

ఎంపికైన సంస్థ ఒక్కో చెట్టును తొలగించి మరో చోట నాటడంతో పాటు ఆ చెట్లు పాదుకునే వరకూ అవసరమైన సంరక్షణ పనులు చేయాల్సి ఉంటుంది. నీళ్లు పోయడం, ఎరువులు వేయడం, సూపర్ విజన్​తదితర పనులు కాట్రాక్టు సంస్థ చేయాలి. చెట్లు పాడవకుండా మనుగడ సాగిస్తేనే బిల్లులు చెల్లించేలా ఒప్పందం చేసుకోనున్నారు. ఒక్కో చెట్టు సైజును బట్టి తొలగించి వేరే చోట నాటాలంటే రూ.7 వేల నుంచి రూ.25వేల వరకు ఖర్చు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుకు 7.27 కోట్ల వరకు ఖర్చుకాగలవని భావిస్తున్నారు.  ఈ పనులను హెచ్ఎండీఏలోని ఇంజినీరింగ్​, అర్బన్​ఫారెస్ట్​ విభాగం పర్యవేక్షించనున్నది.