
- రామగుండం ఎయిర్పోర్ట్కు స్థల పరిశీలన
- బసంత్నగర్, అంతర్గాంలో పర్యటించిన ఏఏఐ టీమ్
గోదావరిఖని, వెలుగు : రామగుండం ఏరియాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రతినిధుల టీమ్ శుక్రవారం జిల్లాలో పర్యటించింది. ఏఏఐ డీజీఎం మల్లిక సారథ్యంలో ముగ్గురు ఆఫీసర్ల బృందం బసంత్నగర్లోని పాత రన్ వే, అంతర్గాంలోని ప్రతిపాదిత స్థలాన్ని మ్యాప్ల ద్వారా పరిశీలించారు. బసంత్నగర్లోని పాత రన్వేనే ఎయిర్పోర్టుగా మార్చాలన్న ప్రపోజల్ ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం అంతర్గాంలో కొత్త ప్లేస్ను గుర్తించిన నేపథ్యంలో ఈ రెండు స్థలాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. బసంత్నగర్లో సుమారు 300 ఎకరాలు, అంతర్గాం నుంచి రాయదండి మధ్యలో 500 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఏఏఐ ప్రతినిధుల వెంట పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, అంతర్గాం తహసీల్దార్ రవీందర్ ఉన్నారు.
బసంత్నగర్లోనే ఎయిర్పోర్టు నిర్మించాలి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
రామగుండం ప్రాంతంలోని బసంత్నగర్లోనే ఎయిర్పోర్ట్ను నిర్మించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ కుట్రలకు తావివ్వొద్దంటూ గతంలోనే కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుకు లేఖ రాయడంతో పాటు పలుమార్లు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. టెక్నికల్ ఫీజిబులిటీ రిపోర్ట్ పేరుతో బసంత్నగర్లో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని ఎంపీ వంశీకృష్ణ కేంద్ర మంత్రిని కోరారు.