
తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాలలో. నగరాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతల నడుమ పండుగ జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. సిటీలో ఉండే వాళ్లు దగ్గర్లో ఉండే పార్క్ లకు వెళ్లి వేప పూత, మామిడి ఆకులు తెచ్చి ఉగాది పచ్చడి చేసి కుటుంబ సభ్యలుతో ఆనందంగా గడుపుతున్నారు. ప్రతి ఇంట్లో భక్ష్యాలు, పోలెలు, ఉగాది పచ్చడి ఇతర పిండి వంటలతో సందడి నెలకొంది.
పండుగ ఎవరింట్లో వారు లేదంటే కొద్దిమంది చుట్టాలతో జరుపుకుంటారు. కానీ ఆ ఊరు మాత్రం అందరం ఒకే కుటుంబం.. అందరం చుట్టాలమే. కులమూ, మతమూ అంటూ లేదు. అందరం కలిసి సామూహికంగా పండుగ జరుపుకుంటేనే ఆనందం అని వైవిధ్యంగా పండుగ జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం తేజాపూర్ లో ఉగాది వేడుకలు ఇప్పుడు దేశాన్నే ఆకర్శిస్తన్నాయి. ఆ గ్రామం ఆదర్శంగా నిలుస్తూ అందరి నోటా మెదులుతోంది.
Also Read : ఈ సంవత్సరం ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేరుస్తాం
గ్రామస్తులందరూ ఒకే చోట చెలకల్లో, పొలాలల్లో చేరి పండగ జరుపుకున్నారు. ముందుగా రైతులు భూమాతకు పూజలు నిర్వహించి పండుగ ప్రారంభించారు. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో వండిన నైవేద్యాన్ని భూమికి సమర్పించారు. పూజల తర్వాత సాగు పనులు ప్రారంభించారు రైతులు. ఉగాది రోజు వ్యవసాయ పనులు చేస్తే ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం.
ఆ తర్వాత గ్రామస్థులు అందరు కలిసి సామూహికంగా వంటలు చేసుకోని వరుసగా బంతి భోజనాలు చేశారు. ఇది తమకు కొన్ని ఏండ్లుగా వస్తున్న ఆచారమంటున్నా రైతులు చెబుతున్నారు.
ప్రస్తుత జీవన శైలిలో పక్కింటోళ్లు, ఎదురింటోళ్లతోనే మాట్లాడే పరిస్థితి లేదు. అందులో కులం, మతం అంటూ అడ్డుగోడలు. ఏదో యాంత్రిక జీవితం.. కృత్రిమ సంబంధాలు అన్నట్లుగా మారిన ప్రస్తుత సమాజంలో.. ఊరంతా ఒకే చోట చేరి పండుగ చేసుకుని.. సామూహిక బంతి భోజనాలు చేయడం విశేషం.