ఆర్టీసీ బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ

ఆర్టీసీ బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ
  • హైదరాబాద్ సిటీ బస్సులో గర్భిణికి నొప్పులు 
  • వెంటనే స్పందించి ప్రసవం చేసిన మహిళా కండక్టర్ సరోజ
  • పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. తల్లి, బిడ్డ క్షేమం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సులో టికెట్లు కొట్టే కండక్టరమ్మ ఓ గర్భిణికి పురుడు పోసింది. తాను డ్యూటీ చేస్తున్న బస్సులో గర్భిణికి నొప్పులు రాగా, వెంటనే స్పందించి అదే బస్సులో ఆమెకు ప్రసవం చేసింది. ఆ మహిళా కండక్టర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముషీరాబాద్ డిపోకు చెందిన 1జెడ్​ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతారత్నం అనే గర్భిణి ఆరాంఘర్​లో ఎక్కారు. బహదూర్​పురా వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.

 నొప్పులు తీవ్రం కావడంతో గమనించిన బస్​ కండక్టర్ ఆర్.సరోజ వెంటనే అప్రమత్తమైంది. మహిళా ప్రయాణికుల సాయంతో బస్సులోనే ఆ గర్భిణికి సాధారణ ప్రసవం చేసింది. శ్వేతారత్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, బిడ్డను మెరుగైన వైద్యం కోసం సమీపంలోని గవర్నమెంట్​మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారు. కాగా, ఇటీవల కరీంనగర్ బస్టాండ్​లోనూ ఓ గర్భిణికి అక్కడి ఆర్టీసీ సిబ్బందే పురుడుపోశారు. 

మంత్రి అభినందనలు..  

బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ సరోజ, తోటి మహిళా ప్రయాణికులకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అభినందనలు తెలిపారు. కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. గర్భిణికి పురుడు పోసి మహిళా కండక్టర్ సరోజ మానవత్వం చాటుకున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ​అన్నారు. ఆమెకు, తోటి మహిళా ప్రయాణికులకు ఆయన అభినందనలు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవాస్ఫూర్తిని చాటుతుండడం అభినందనీయమని సజ్జనార్​ పేర్కొన్నారు.