మరీ ఇంత దారుణమా..! పక్కన నిల్చో అన్నందుకు కండక్టర్‎ను కత్తితో పొడిశాడు

మరీ ఇంత దారుణమా..! పక్కన నిల్చో అన్నందుకు  కండక్టర్‎ను  కత్తితో పొడిశాడు

బెంగుళూరు: ఐటీ కంపెనీలకు నిలయమైన బెంగుళూరులో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఫుట్‌బోర్డ్‌కు దూరంగా నిలబడమని చెప్పినందుకు తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ యువకుడు ఏకంగా కండక్టర్‎ను కత్తితో పొడిశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన హర్ష్ సిన్హా అనే యువకుడు బెంగుళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, నెల రోజుల క్రితం అనివార్య కారణాల వల్ల హర్ష్ సిన్హాను ఉద్యోగం నుండి తొలగించారు.  జాబ్  పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై హర్ష్ అప్పటి నుండి ఒత్తిడిలోనే ఉంటున్నాడు.  మంగళవారం (అక్టోబర్ 1) జాబ్ సెర్చింగ్‎లో భాగంగా బెంగుళూరు నుండి మరో ప్రాంతానికి బస్సులో వెళ్తున్నాడు.

 ఈ క్రమంలో బస్సు ఫుట్ బోర్డుపై నిలబడ్డ హర్ష్‎ను లోపలికి రావాలని.. ఫుట్ బోర్డుపై నిలబడితే బస్సు ఎక్కే దిగే వారికి ఇబ్బంది అవుతోందని కండక్టర్ అన్నాడు. దీంతో కండక్టర్, హర్ష్‎కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన హర్ష్ తన బ్యాగులో ఉన్న కత్తితో కండక్టర్‎పై దాడి చేశాడు. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు నుండి కిందకు పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ హర్ష్‎ను లోపలే బంధించి బస్సు డోర్లు లాక్ చేశాడు. 

ALSO READ | ఇదో విచిత్రమైన కేసు: ఆ మాత్రం తెలివి కూడా లేదా.. ఎందుకు పనికొస్తార్రా మీరు..!

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన కండక్టర్‎ను ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న నిందితుడు హర్ష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ  ఘటన ఐటీపీఎల్ బస్టాప్ సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేశారు. ఉద్యోగం పోయిన బాధలోనే దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కాగా,  నిందితుడు హర్ష్ కండక్టర్‏ను పొడవడంతో పాటు అనంతరం బస్సు నుండి తప్పించుకునేందుకు బస్సు కిటికీలు పగలకొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.