పేద మద్య తరగతి వాళ్లకు గుడ్ న్యూస్..ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు ఆధార్‌‌‌‌ అక్కర్లే

పేద మద్య తరగతి వాళ్లకు గుడ్ న్యూస్..ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు ఆధార్‌‌‌‌ అక్కర్లే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందడానికి ఆధార్‌‌‌‌ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు కౌంటర్​ సమర్పించింది. ఆధార్‌‌‌‌  కార్డుతో నిమిత్తం లేకుండా వైద్యసేవలు అందిస్తున్నామని వెల్లడించింది. ఆధార్‌‌‌‌ కార్డు లేనివారికి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్​కు చెం దిన బైరెడ్డి శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన పిల్‌‌‌‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌  సుజయ్‌‌‌‌ పాల్, జస్టిస్‌‌‌‌ రేణుక యారాతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.

 ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌‌‌‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై కౌంటరు దాఖలు చేశామని, ఉస్మానియా ఆస్పత్రిలో అదే రోజు పిటిషనర్‌‌‌‌ పేర్కొన్న మహిళతో పాటు మరో 100 మందికి ఆధార్‌‌‌‌ లేకుండా చికిత్స అందించామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం ఆధార్‌‌‌‌  అవసరం లేదన్నారు. ఈ వాదనలను నమోదు చేసిన ధర్మాసనం.. పిటిషన్‌‌‌‌పై ఎలాంటి విచారణ అవసరం లేదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.