
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఆ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ‘అహంకారం’ వల్లే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. ఈ సందర్భంగా మహాభారతంలోని ‘దౌపది వస్త్రాపహరణ’ ఘట్టానికి సంబంధించిన ఫోటో ‘ఎక్స్’ లో షేర్ చేశారు. శనివారం మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో ‘ఆప్’ ఓటమి దాదాపు ఖాయమై బీజేపీ విజయం వైపు వెళ్తున్న ‘ట్రెండ్స్’ కొనసాగుతున్న సమయంలో ఆమె ఈ పోస్ట్ లు పెట్టారు.
అలాగే ‘‘రావణుడి అహంకారం కూడా కొనసాగలేదు’’ అని మరొక పోస్టులో పేర్కొన్నారు. మలివాల్ గతేడాది ఆప్ తో విభేదించిన సంగతి తెలిసిందే. నిరుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంవోలోనే ఆమెపై దాడి జరిగింది. కేజ్రీవాల్వ్యక్తిగత సహాయకుడు బిభవ్కుమార్ఆమెపై భౌతిక దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టినట్టు కేసు నమోదైంది. ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం ఫోటోలు ఆ విషయాన్ని గుర్తు చేసే ఉద్దేశంతోనే ఆమె పోస్టు
చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.