![రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్గా హాజరుకానున్న అబ్దెల్](https://static.v6velugu.com/uploads/2023/01/Abdel-will-attend-the-Republic-Day-celebrations-as-the-Chief-Guest_vuw2n3Kk6W.jpg)
- ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతా ఎల్ సీసీతో చర్చలు
- కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య ఎంవోయూ
న్యూఢిల్లీ: ప్రపంచానికి టెర్రరిజం ఓ ముప్పుగా మారిందని, దీన్ని నియంత్రించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని ప్రధాని మోడీ అన్నారు. ఇండియాతో కలిసి పనిచేసేందుకు ఈజిప్ట్ అంగీకరించిందని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఇండియాకు వచ్చిన ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతా ఎల్ సీసీ బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దీనికి ముందు రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.
కీలక రంగాల్లో ఎంవోయూ కుదిరింది: మోడీ
జాయింట్ ప్రెస్కాన్ఫరెన్స్లో మోడీ మాట్లాడారు. ‘‘పాలిటిక్స్, సెక్యూరిటీ, ఎకనామిక్స్, సైన్స్ రంగాల్లో ఈజిప్ట్తో స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కొనసాగిస్తాం. దీర్ఘకాలిక సహకారాలు కొనసాగుతాయి. సైబర్ సెక్యూరిటీ, కల్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యూత్ మ్యాటర్స్, బ్రాడ్ కాస్టింగ్ రంగాల్లో సాయానికి ఎంవోయూ కుదిరింది” అని మోడీ తెలిపారు.
గౌరవంగా భావిస్తున్నా: అబ్దెల్
ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సీసీ మాట్లాడుతూ.. ‘‘మోడీని లాస్ట్ టైం 2015లో న్యూయార్క్లో కలిశాను. ఆయనపై నాకెంతో విశ్వాసం ఉంది. ఇండియాను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో నాకు తెలుసు. రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నాను. అందరికీ హ్యాపీ రిపబ్లిక్డే” అని అన్నారు. కాగా, 75 ఏండ్ల ఇండియా, ఈజిప్ట్ దౌత్య సంబంధాలకు గుర్తుగా పోస్టల్ స్టాంప్ను మోడీ, అబ్దెల్లు ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు.
అంబేద్కర్కు రుణపడి ఉంటాం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు ఇండియా ఎప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగానికి తుది రూపం ఇవ్వడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతలు చూపించిన మార్గంలోనే ప్రతీ ఒక్కరు నడవాలని, ఇది మన బాధ్యత అని సూచించారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని బుధవారం ఆమె జాతినుద్దేశించి మాట్లాడారు. ‘ఇండియన్ జర్నీ విదేశాలను ప్రేరేపించింది. ఇండియన్ హిస్టరీని చూపి ప్రతీ ఒక్కరు గర్వపడాలి. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ కమిటీకి అంబేద్కర్ నాయకత్వం వహించారు. దీన్ని ఎవరూ మరిచిపోవద్దు. రాజ్యాంగానికి తుది రూపు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. డ్రాఫ్ట్ తయారు చేసిన బీఎన్ రావు, సాయపడిన నిపుణులు, ఆఫీసర్లను కూడా మనం స్మరించుకోవాలి’ అని ముర్ము అన్నారు.