
హైదరాబాద్: ఐపీఎల్ 18లో భాగంగా శనివారం (ఏప్రిల్ 12) పంజాబ్తో జరిగిన మ్యాచులో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ అభిషేక్ వర్మ ఆకాశమే హద్దుగా చేలరేగాడు. స్పిన్నరా.. పేసరా అని చూడకుండా బాల్ను స్టాండ్స్కు పంపడమే టార్గెట్ అన్నట్లుగా రెచ్చిపోయాడు. పంజాబ్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 55 బంతుల్లోనే (14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141) చిరస్మరణీయ సెంచరీ సాధించాడు.
అభిషేక్ తుఫాన్ ఇన్సింగ్స్తో 246 పరుగుల కొండంత లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఎస్ఆర్హెచ్ అలవోకగా ఛేజ్ చేసి సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెరుపు ఇన్సింగ్స్తో అభిషేక్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (141) చేసిన తొలి ఇండియన్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాహుల్ 132 రన్స్ చేశాడు.
పంజాబ్పై 141 పరుగులు చేసి ఈ రికార్డును అభిషేక్ తుడిచిపెట్టాడు. ఇక.. ఐపీఎల్ హిస్టరీలో ఇది ఓవరాల్గా మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరు. డేంజరస్ బ్యాటర్ క్రిస్ గేల్ 175 పరుగులతో టాప్లో ఉన్నాడు. 158 పరుగులతో బ్రెండన్ మెకల్లమ్ రెండవ స్థానంలో ఉన్నాడు. అలాగే.. ఐపీఎల్లో రెండో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ చిచ్చర పిడుగు ఒక్క ఇన్నింగ్స్లో 24 బౌండరీలు బాదగా.. మొదటి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు.
ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్స్:
అభిషేక్ శర్మ 141 పరుగులు
కెఎల్ రాహుల్ 132* పరుగులు
శుభ్మాన్ గిల్ 129 పరుగులు
రిషబ్ పంత్ 128* పరుగులు
మురళీ విజయ్ 127 పరుగులు