
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మెదక్లో ఏబీవీపీ మెదక్ విభాగ్ కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ శశికాంత్, సంగారెడ్డి, సిద్దిపేటలో జిల్లా కన్వీనర్లు ఆకాశ్, వివేక్ మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు ఇవ్వకుండా స్టూడెంట్స్కు అన్యాయం చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యార్థి వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తోందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ యూనివర్సిటీలలో 75 శాతం పైగా ఖాళీగా ఉన్న అధ్యాపక, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేసి, వాటికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. మెదక్ పట్టణం నుంచి ఉమెన్స్ డిగ్రీ కాలేజీని భువనగిరికి తరలించడాన్ని నిలిపివేయాలని, ఉమెన్స్ జూనియర్ కాలేజీకి ప్రహరీ నిర్మించి ముంపు నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు.