
- లంచం తీసుకుంటూ డీఈఈతో పాటు మున్సిపల్ ఆర్ఐ,
- సీనియర్ అసిస్టెంట్ పట్టివేత
ఆదిలాబాద్/మెదక్ టౌన్/ఖమ్మం టౌన్, వెలుగు: లంచం తీసుకుంటూ మంగళవారం ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి..ఆదిలాబాద్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ జిన్నంవార్ శంకర్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్(బాలికల) బిల్డింగ్కు సంబంధించిన రూ.2 కోట్ల బిల్లు చెల్లించేందుకు రూ.2 లక్షలు ఇవ్వాలని కాంట్రాక్టర్ను డిమాండ్ చేశాడు.
ఆ తరువాత రూ.లక్షకు ఒప్పుకున్నాడు. మొదటి విడతగా రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, వారి సూచనల మేరకు మైనార్టీ స్కూల్లో నగదు అందజేశాడు. అక్కడే వేచి ఉన్న ఏసీబీ అధికారులు డీఈఈని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు.
మెదక్లో..
మెదక్ పట్టణానికి చెందిన గెల్లి శైలజకు స్థలాన్ని మ్యుటేషన్ చేయించేందుకు ఆమె సోదరుడు శ్రీనివాస్ మున్సిపల్ ఆఫీస్లో దరఖాస్తు చేశాడు. మున్సిపల్ ఆర్ఐ జానయ్య రూ.20 వేలు డిమాండ్ చేయగా, రూ.12 వేలు ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం మున్సిపల్ ఆఫీస్లో రూ.12 వేలు లంచం ఇవ్వగా, ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో దాడి చేసి రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్నారు.
ఖమ్మం ఎక్సైజ్ ఆఫీస్లో..
ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ భూక్య సోమ్లానాయక్ రూ.15 వందలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. నగరంలోని మూత పడిన బార్ ఓనర్కు కోర్టుకు సమర్పించాల్సిన లైసెన్స్ జిరాక్స్ కోసం సీనియర్ అసిస్టెంట్ సోమ్లా నాయక్ రూ.2 వేలు డిమాండ్ చేశాడు. 15 రోజులుగా లైసెన్స్ కాపీ కోసం తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు సోమ్లానాయక్కు రూ.15 వందలు ఇవ్వగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.